నేరేడ్మెట్ వాయుపురిలో సోమవారం హెల్మెట్పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి సూచనల మేరకు ద్విచక్ర వాహనదారుల్లో రోడ్డు భద్రతపై చైతన్యం కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ లక్ష్మీ తెలిపారు.
హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్న బైక్ రైడర్లను ఆపి, ముందుగా కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ప్రమాదాల సమయంలో హెల్మెట్ ప్రాణాలను ఎలా రక్షిస్తుందో వివరించి అవగాహన కల్పిస్తున్నారు. అనంతరం ‘హెల్మెట్ బ్యాంక్’ ద్వారా వారికి తాత్కాలికంగా ఒక హెల్మెట్ను అందజేస్తున్నారు.
సాయంత్రం వరకు ఆ హెల్మెట్ను ఉపయోగించి, కొత్త హెల్మెట్ కొనుగోలు చేసిన తర్వాత తీసుకున్న హెల్మెట్ను తిరిగి డిపాజిట్ చేయాలని సూచిస్తున్నారు. ఈ విధానం ద్వారా రైడర్లలో బాధ్యత పెంపొందించడమే లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ట్రాఫిక్ ఏసీపీ, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఈ అవగాహన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
