సైనిక పాలన(Military Rule)పై విమర్శలు పెరుగుతున్న తరుణంలో మయన్మార్ ఐదేళ్ల విరామం అనంతరం తొలిసారిగా సార్వత్రిక ఎన్నికల(General Election)ను(First Phase) ఆదివారం నిర్వహించనుంది. రెండో దశ జనవరి 11న, మూడో దశ జనవరి 25న జరుగుతుంది. అయితే ఈ ఎలక్షన్లు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగే అవకాశం లేదని, అధికారం సైనిక నాయకుడు సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లైంగ్(Gen Min Aung Hlaing) చేతుల్లోనే ఉండే అవకాశం ఉందని మానవ హక్కుల సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నాయి. మయన్మార్లో అధికారాన్ని 2021లో సైన్యం స్వాధీనం చేసుకుంది. దీంతో.. ప్రజాస్వామిక పాలన రద్దయింది.
ఇదిలాఉండగా ఇప్పుడు జరగబోయే ఎన్నికలు ప్రజాస్వామిక పాలనను పునరుద్ధరించలేదని, సైనిక పాలన వల్ల ఏర్పడ్డ వినాశకరమైన అంతర్యుద్ధాన్ని అంతం చేయదని విమర్శకులు అంటున్నారు. కానీ.. ఈ ఎన్నికల ద్వారా బహుళ పార్టీ ప్రజాస్వామ్యానికి తిరిగి వస్తున్నట్లుగా సైన్యం చిత్రీకరించింది. నాలుగేళ్ల కిందట ఆంగ్ సాన్ సూకీ(Aung San Suu Kyi) ప్రభుత్వాన్ని సైన్యం గద్దె దించిన తర్వాత ప్రారంభమైన తమ పాలనకు చట్టబద్ధత కల్పించడానికి ప్రయత్నించింది. బలవంతంగా జరిగిన ఈ స్వాధీనం తీవ్రమైన ప్రజా వ్యతిరేకతకు దారితీసింది. అనంతరం అంతర్యుద్ధంగా మారింది. ఈ పోరాటం అనేక పోటీ ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణను క్లిష్టతరం చేసింది.
