డీసీపీపై కత్తితో దాడికి యత్నించిన సెల్ ఫోన్ దొంగ
ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపిన డీసీపీ
దొంగకు గాయాలు… ఆసుపత్రికి తరలింపు
హైదరాబాద్ నగరంలో శనివారం సాయంత్రం చాదర్ఘాట్(chaderghat)లో కాల్పుల (firing in hyderabad) కలకలం రేగింది. ఇద్దరు సెల్ ఫోన్ దొంగలపై సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ(south east zone dcp) సాయి చైతన్య (sai chaitanya) స్వయంగా కాల్పులు జరిపారు. తనపై కత్తితో దాడికి యత్నించడంతో ఆయన ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఓ దొంగ గాయపడగా, మరొకరు పరారయ్యారు. సాయంత్రం సమయంలో కార్యాలయ సమావేశం ముగించుకుని తిరిగి వస్తున్న డీసీపీ సాయి చైతన్య, చాదర్ఘాట్ విక్టరీ ప్లే గ్రౌండ్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు ఓ పాదచారిపై నుంచి మొబైల్ ఫోన్ లాక్కొని పారిపోతున్న దృశ్యాన్ని గమనించారు. వెంటనే అప్రమత్తమై, తన గన్మెన్తో కలిసి వారిని వెంబడించారు.

ఈ క్రమంలో దొంగల్లో ఒకరు డీసీపీపై కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించగా, డీసీపీ కిందపడిపోయారు. వెంటనే ఆత్మరక్షణ కోసం ఆయన తన సర్వీస్ రివాల్వర్తో కాల్పులు జరిపారు. దీంతో ఓ దొంగ కాలికి బుల్లెట్ తగిలి గాయపడ్డాడు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, చికిత్స కోసం నాంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో దొంగ చీకటి వాతావరణాన్ని ఆసరాగా చేసుకుని పారిపోయాడు. కాల్పుల వార్త తెలియగానే స్థానికులు పెద్ద సంఖ్యలో ఘటనాస్థలానికి చేరుకున్నారు. కొద్ది సేపటికి అదనపు పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. చాదర్ఘాట్ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. సౌత్ ఈస్ట్ జోన్ పోలీస్ బృందాలు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించాయి. పట్టుబడిన నిందితుడి గత నేర చరిత్ర, సంబంధిత దొంగల నెట్వర్క్పై దర్యాప్తు కొనసాగుతోంది.

