- ఆఫ్రికా దేశాల్లో వెలుగు చూస్తున్న దారుణాలు..
ఆఫ్రికా దేశాల్లో అనేక రకాల మోసాలు కామన్గా మారాయి. తాజాగా నైజీరియాలోని అనంబ్రా స్టేట్లో ‘బీబీసీ ఆఫ్రికా ఐ’ చేసిన ఇన్వెస్టిగేషన్లో ఒక దారుణమైన కుంభకోణం బయటపడింది. ఇక్కడ నకిలీ క్లినిక్స్ నిర్వహిస్తూ, మహిళలు గర్భం దాల్చినట్లు మోసం చేస్తూ, శిశువుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. సంతానం కలగాలని ఆశపడుతున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని దారుణాలకు తెగబడుతున్నారు. ఇలాంటి వారి నుంచి ‘మిరాకిల్ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్’ పేరిట పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్నారు.
స్కామర్లు వైద్యులు లేదా నర్సులుగా నటిస్తూ, వందల డాలర్లు ఖరీదు చేసే నకిలీ సంతానోత్పత్తి చికిత్సలను మహిళలకు అందిస్తారు. ఇందులో భాగంగా ఇంజెక్షన్లు చేస్తారు, స్పెషల్ డ్రింక్స్ ఇస్తారు. కొన్ని పదార్థాలను యోనిలోకి చొప్పిస్తారు. ఈ చికిత్సలతో వంద శాతం గర్భం దాలుస్తారని హామీ ఇస్తారు. ఇవన్నీ జరిగిన తర్వాత కొంత మంది మహిళలకు కడుపు ఉబ్బడం వంటి శారీరక మార్పులు కనిపిస్తాయి. దీంతో గర్భం దాల్చినట్లు చాలా మంది భ్రమ పడతారు.
