రేపు, ఎల్లుండి (డిసెంబర్ 8, 9 తేదీల్లో) రెండు రోజులు భారత్ ఫ్యూచర్ సిటీ(Bharat Future City)లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Telangana Rising Global Summit) ఆతిథ్యానికి సర్వం సిద్ధమైంది. ప్రపంచ పెట్టుబడుల ఆకర్షణ, నవీన ఆవిష్కరణలకు కేంద్రంగా, తెలంగాణ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు అన్ని వసతులతో ఆకట్టుకునేలా అత్యంత ఆకర్షణీయంగా రూపుదిద్దుకున్నాయి.

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాల మేరకు వరుసగా రెండో రోజు (శనివారం) ఉన్నతాధికారులతో కలిసి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) పరిశీలించారు.

సదస్సు జరిగే చోటా తెలంగాణ తల్లి విగ్రహం(Telangana Thalli Statue)తోపాటు అనేక డిజిటల్ స్క్రీన్లు, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే అనేక సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ శాఖలు, కార్పోరేషన్లకు సంబంధించిన ప్రత్యేక స్టాల్స్ ఉన్నాయి.

ముఖ్యంగా అనేక దేశాల నుంచి ప్రముఖులు, ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులు రానున్ననేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత, నిఘా కల్పించారు. రేపు మధ్యాహ్నం అంగరంగ వైభవంగా వేడుకలు ప్రారంభమై డిసెంబర్ 9న సాయంత్రం ముగుస్తాయి. ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ వల్ల తెలంగాణ ఖ్యాతి ఖండాంతరాలు దాటడం ఖాయం.


