- తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా స్పందన..
- తెలుగు జాతి ఎప్పటికీ ఒక్కటే అని ట్వీట్..
తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ… రెండు రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయినప్పటికీ, తెలుగు జాతి ఎప్పుడూ ఒక్కటేనని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అభివృద్ధిలో ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ముందుకు దూసుకుపోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
రాబోయే రోజుల్లో తెలుగు వారు మరెన్నో విజయాలను సాధించాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరాలు ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలుగా ఎదగాలని తన సందేశంలో పేర్కొన్నారు. ప్రతి తెలుగు కుటుంబం అభివృద్ధి ఫలాలను అందుకోవాలని, అత్యున్నత జీవన ప్రమాణాలను సాధించాలని ఆకాంక్షించారు. ‘వికసిత భారత్ 2047’ లక్ష్య సాధన కోసం రెండు రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేస్తూ, తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటాలని ఆయన పిలుపునిచ్చారు.
