- దద్దరిల్లిన కోదాడ.
- బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శాంతియుతంగా ముగిసిన నిరసన.
- పాల్గొన్న నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి,కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్.
దళిత యువకుడు కర్ల రాజేష్ పోలీస్ హత్యకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చలో కోదాడ’ నిరసన ర్యాలీ కోదాడ పట్టణంలో శాంతియుతంగా కొనసాగి విజయవంతంగా ముగిసింది. ఈ ఘటనకు 60 రోజులు గడుస్తున్నా న్యాయం జరగకపోవడాన్ని నిరసిస్తూ పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఈ ర్యాలీలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి, రాజేష్ తల్లి కర్ల లలితమ్మలతో కలిసి కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేష్ పోలీస్ హత్య జరిగి 60 రోజులు పూర్తవుతున్నా, స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు కనీసం స్పందించకపోవడం అత్యంత దారుణమన్నారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, వారిని కాపాడే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
షాడో ఎమ్మెల్యేల రాజ్యం – మాఫియా పాలన :
ఉత్తమ్ దంపతులు టూరిస్టుల్లా మారి పాలన సాగిస్తుండగా, కోదాడలో షాడో ఎమ్మెల్యేల రాజ్యం, మాఫియా పాలన నడుస్తోందని విమర్శించారు. పోలీసులకు అడ్డు అదుపు లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించే పరిస్థితులు నెలకొన్నాయని మండిపడ్డారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించడంతో జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులపై దాడులు, ఆస్తి నష్టం, దిమ్మెలు పగలగొట్టడం వంటి ఘటనలకు పాల్పడుతున్నా పోలీసులు చూస్తూ ఊరుకుంటున్నారని ఆరోపించారు.
సీఐపై తీవ్ర ఆరోపణలు :
కోదాడ పట్టణ సీఐ వ్యవహార శైలి “రౌడీకి కాకి చొక్కా తొడిగినట్లుగా” ఉందని తీవ్రంగా విమర్శించారు. ఆయన గత చరిత్ర అవినీతితో నిండిపోయిందని, కోదాడలో ఇసుక, మద్యం, మట్టి మాఫియాలతో ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు.
కేవలం లక్ష రూపాయల చెక్కుతో ప్రాణాలు :
కేవలం లక్ష రూపాయల చెక్కు విషయంలో కర్ల రాజేష్ను విచారణ పేరుతో పోలీస్ స్టేషన్కు పిలిపించి, అతని హత్యకు చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డి ప్రత్యక్ష కారణమై ఉన్నా, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. విచారణ నుంచి పోస్టుమార్టం వరకు మొత్తం వ్యవస్థ పారదర్శకంగా లేదని ఆరోపించారు.
న్యాయం జరిగే వరకు పోరాటం :
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ప్రజల ముందు, ప్రభుత్వ ముందు అనేక ఆధారాలు ఉంచినా స్పందన లేకపోవడం చూస్తే, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారో అర్థమవుతోందన్నారు. రాజేష్ మరణంతో వృద్ధాప్యంలో ఉన్న అతని తల్లి అనుభవిస్తున్న వేదనకు పాలకులే బాధ్యులని వ్యాఖ్యానించారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అధికారుల ఉద్యోగాలకు భద్రత ఉందే తప్ప, సామాన్య ప్రజల ప్రాణాలకు భద్రత లేదని తీవ్రంగా విమర్శించారు. రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
