- ‘క్యాస్ట్ సెన్సస్…’ పుస్తకావిష్కరణలో వక్తల ఉద్ఘాటన
దేశంలో అట్టడుగు వర్గాలకు నిజమైన సామాజిక న్యాయం అందాలంటే జాతీయ స్థాయిలో సమగ్ర కులగణన నిర్వహించడం తక్షణ ఆవశ్యకమని పలువురు ఎంపీలు, విద్యావేత్తలు స్పష్టం చేశారు. ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ (AIOBCSA) ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో “క్యాస్ట్ సెన్సస్ అండ్ డీపెనింగ్ ఆఫ్ సోషల్ జస్టిస్” పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా వివిధ పార్టీల నేతలు, మేధావులు మాట్లాడుతూ.. శాస్త్రీయ విధానాల రూపకల్పనకు కులాల వారీ జనాభా లెక్కలు ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు.

కులగణన ద్వారా మాత్రమే రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, వనరుల కేటాయింపులు పారదర్శకంగా మరియు న్యాయబద్ధంగా జరుగుతాయని,సరైన గణాంకాలు లేకపోవడం వల్లే అనేక ప్రభుత్వ విధానాలు ఆశించిన మేర ఫలితాలు ఇవ్వడం లేదని,జనాభా ప్రాతిపదికన విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో అణగారిన వర్గాలకు సముచిత ప్రాధాన్యం దక్కుతుందని తద్వారా రాజ్యాంగ లక్ష్యాలు నెరవేరుతాయని వక్తలు పేర్కొన్నారు.
పుస్తక విశేషాలు:
ఏఐవోబీసీఎస్ఏ (AIOBCSA) జాతీయ అధ్యక్షుడు జి.కిరణ్ కుమార్, డాక్టర్ వాహిని బిళ్లు సంపాదకత్వం వహించిన ఈ పుస్తకంలో.. ఎంపీలు, ప్రొఫెసర్ కంచె ఐలయ్య షెపర్డ్ సహా పలువురు కేంద్ర విశ్వవిద్యాలయాల అధ్యాపకులు, పరిశోధకులు కులగణన ఆవశ్యకతపై తమ విశ్లేషణాత్మక వ్యాసాలను పొందుపరిచారు.
ఈ కార్యక్రమంలో ఎంపీలు సంజయ్ సింగ్ (ఆప్), విల్సన్ (డీఎంకే), మల్లు రవి (కాంగ్రెస్), ఆర్.కృష్ణయ్య (రాజ్యసభ), మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్, బీపీ మండల్ మనవడు ప్రొఫెసర్ సూరజ్ మండల్, ప్రొఫెసర్ సందీప్ యాదవ్, నేషనల్ బీసీ ఇంటెలెక్చువల్ ఫోరమ్ అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ, సుప్రీంకోర్టు న్యాయవాది శశాంక్ రత్నూ, ఓబీసీ హక్కుల ఉద్యమ నాయకురాలు రత్నా సేతుపతి తదితరులు పాల్గొన్నారు.
