Friday, March 6, 2026
Homeసాహిత్యంLibrary Movement | పుస్తకాలే అయన ప్రాణం..పుస్తకాలయాలే ఆయన లోకం…

Library Movement | పుస్తకాలే అయన ప్రాణం..పుస్తకాలయాలే ఆయన లోకం…

  • దేశంలోనే తొలి గ్రంథాలయ సంఘ స్థాపకులు అయ్యంకి
  • మార్చి 7… గ్రంథాలయ పితామహ అయ్యంకి వెంకట రమణయ్య వర్ధంతి

పుట్టడం, గిట్టడం సహజం. జీవించినంతలో సమాజానికి ఉపయోగపడే పనులు చేయడం మానవ ధర్మం. కొంతమంది మాత్రమే తమ జీవితంలో ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణంగా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు . అలాంటి వాటిలో…అయ్యంకి వెంకట రమణయ్య ముఖ్యులు. గ్రంథాలయోద్యమం అనగానే గుర్తుకు వచ్చే పేరు ఆయనదే. “పుస్తకాలే ప్రాణంగా…పుస్తకాలయాలే లోకం”గా జీవించిన వ్యక్తి. గ్రంథాలయోద్యమ పితా మహుడుగా, జీవితాంతం గ్రంథాలయాల అభివృద్ధి కోసం, అద్వితీయంగా, అనన్యంగా, అహర్నిశలూ, బహుముఖ సేవలందించిన గొప్ప వ్యక్తి అయ్యంకి.

అయ్యంకి వెంకట రమణయ్య (1890-1979) గ్రంథాలయోద్యమ కారుడు, ఆయుర్వేదం, ప్రకృతి వైద్యంలో సిద్దహస్తులు, పత్రికా సంపాదకులు. గ్రంథాలయ సర్వస్వము అనే పత్రికను నిర్వహించారు. అయన గ్రంథాలయ ఉద్యమంలో జీవితాంతం విశేష కృషి సల్పి గ్రంథాలయ పితా మహుడుగా పేరు గాంచారు. ఆయన తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకా అనపర్తి నియోజక వర్గంలోని బిక్కవోలు మండంలో గల కొంకుదురు గ్రామంలో 1890 జూలై 24న జన్మించారు. అయన తల్లిదండ్రులు వెంకటరత్నం, మంగమాంబ. తండ్రి వెంకతరత్నం గారు నీటిపారుదల శాఖలో ఉద్యోగి.

- Advertisement -

1907లోప్రముఖ జాతీయ నాయకుడు, స్వాతంత్య్ర సమర యోధుడు బిపిన్ చంద్రపాల్ రాజమండ్రి లో భారత స్వాతంత్య్ర సమరంలో యువకులు పాల్గొనాలని ఇచ్చిన ఉత్తేజ పూరితమైన ఉపన్యాసాలు విని, చదువుకు స్వస్తి చెప్పి దేశ సేవకు జీవితాన్ని అంకితం చెయ్యటానికి ‘రక్షాబంధనం ‘ కట్టుకొన్నారు.

దేశంలోని పలు సమస్యలకు ముఖ్యకారణం అవిద్య, అజ్ఞానం అని గ్రహించి, అందరినీ విద్యా వంతులుగా, జ్ఞాన వంతులుగా చెయ్యాలని అందుకు గ్రంథాలయాల వ్యాప్తి అవసరమని భావించి ఆ ఉద్యమ వ్యాప్తికి కంకణం కట్టుకొన్నారు.

1910 లో బందరులో “ఆంధ్ర సాహిత్య పత్రిక”ను స్థాపించి, గురజాడ, రాయప్రోలు, శ్రీశ్రీ రచనలను ప్రచురించి, ప్రజలను చైతన్య వంతం చేశారు. 1914లో ప్రథమ ఆంధ్ర రాష్ట్ర గ్రంథ భాండాగార ప్రతినిధుల మహాసభలను విజయ వాడలో నిర్వహించారు. 1919, నవంబరు-14న, చెన్నైలో తొలి “అఖిల భారత పౌర గ్రంథాలయం” ను స్థాపించి, మొదటి మహా సభను నిర్వహించారు. అలాగే ‘గ్రంథాలయ సర్వస్వం’ (త్రైమాసిక), ‘ఇండియన్ లైబ్రరీ జర్నల్’, ‘కొరడా’, ‘ప్రకృతి’, ‘ది ఇండియన్ నేచురోపతి’,’ ‘సహకారం’, ‘దివ్యజ్ఞాన దీపిక’ వంటి పత్రికలను కూడా నడిపారు.

1911లో విజయవాడలో రామమోహన గ్రంథాలయ స్థాపనకు తోడ్పడ్డాడు. 1914లో విజయ వాడలో ఆంధ్రదేశ గ్రంథ భాండాగార, ప్రతినిధుల గ్రంథాలయ మహా సభలు జరిపి భారత దేశంలో తొలిసారిగా గ్రంథాలయ సంఘాన్ని, 1915లో సంఘ పక్షాన గ్రంథాలయ సర్వస్వం పత్రికను స్థాపించడానికి తోడ్పడ్డారు. 1919లో అఖిల భారత పౌర గ్రంథాలయ సంఘాన్ని స్థాపించి, 1924లో ఆ సంఘ పక్షాన ఇండియన్ లైబ్రరీ జర్నల్ అనే ఆంగ్ల పత్రికను ప్రారంభించారు.

1934-1948 మధ్యకాలంలో గ్రంథాలయ యాత్రలను అపూర్వమైన స్థాయిలో పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో కార్యదర్శులు నిర్వహించారు. వీరి మూలంగా వందల సంఖ్యలో కొత్త గ్రంథాలయాలు ఏర్పడ్డాయి. మూసి వేసినవి పునరుద్ధరించ బడ్డాయి. 1920, 1934లలో గ్రంథాలయ కార్యదర్శులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆంధ్రదేశంలోని ప్రతి గ్రామం పర్యటించారు. అయ్యంకి వెంకట రమణయ్య, దేశంలో పూర్తిస్థాయిలో గ్రంథాలయాలను నెలకొల్పిన వ్యక్తిగా పేరు గడించారు.

ఆంధ్రభాషాభివర్థినీ మండలి, ఆంధ్రపరిషత్తు, కళాపీఠము, దివ్యజ్ఞాన చంద్రికామండలి అనే గ్రంథమాలలను స్థాపించి అనేక ఉత్తమ రచనలను తెలుగు పాఠకులకు అందించారు. గ్రంథాలయోద్యమంలో ఆయన సేవలను గుర్తించి, ఆయన సప్తతి మహోత్సవ సందర్భంగా, గుడివాడలో ‘సరస్వతీ సామ్రాజ్య ప్రతిష్ఠాపనాచార్య’ బిరుదుతో
సత్కరించారు.

1919లో అఖిల భారత పౌర గ్రంథాలయ సంఘాన్ని స్థాపించిన రోజును భారత గ్రంథాలయ సంస్థ గుర్తించి నేషనల్ లైబ్రరీ డే (జాతీయ గ్రంథాలయ వారోత్సవ దినం)”గా దేశమంతటా 1968 నుంచి ప్రతి సంవత్సరం జాతీయ గ్రంథాలయ1968 నుండి, “జరుపుకొను చున్నారు. ఆయన అనేక గ్రంథాలయ యాత్రలను నిర్వహించి, “ప్రజా గ్రంథాలయమే ప్రజల విశ్వవిద్యాలయం” అని చాటి చెప్పారు.

భారత ప్రభుత్వం ఆయన గ్రంథాలయ సేవలకు స్పందించి 1972 లో’ ‘పద్మశ్రీ’తో .గౌరవించింది. గ్రంథాలయ పితామహ, గ్రంథాలయోద్ధారక, గ్రంథాలయ విశారద, సరస్వతీ సామ్రాజ్య ప్రతిష్ఠాపనాచార్య, సరస్వతీ రమారమణ, గ్రంథాలయ విశారద వంటి బిరుదులు అందుకున్నారు. 1977లో ప్రొఫెసర్ కౌలా అంతర్జాతీయ స్వర్ణపతకం పొందారు.

ఆంధ్రవిశ్వ కళాపరిషత్తు గ్రంథాలయ శాస్త్ర పరీక్షలో ఉత్తమ విద్యార్థికి అయన పేరుతో స్వర్ణ పతకం ఇస్తున్నది. 1979లో అయ్యంకి లైబ్రరీ కమిటీ ఏర్పడి ప్రతి సంవత్సరం ఉత్తమ గ్రంథాలయ కార్యకర్తను సత్కరిస్తోంది. ఆయన తండ్రి వెంకట రత్నం అయ్యంకిలో శ్రీ గంగా పర్వత.వర్ధనీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం నిర్మించారు. వెంకట రమణయ్య 1979, మార్చి 7న మరణించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News