- శనగలు పండించిన రైతులనుండి వాటిని సేకరించేందుకు సిద్ధం..
- ఈ నెల నుంచి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయని మంత్రి వెల్లడి..
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శనగలు పండించిన రైతుల నుంచి వాటిని సేకరించేందుకు సిద్దమైంది. ఈ నెల నుంచి శనగల కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తాజాగా ప్రకటించారు. అంతేకాదు శనగలు కొనుగోలు చేసిన అనంతరం 15 రోజుల్లోనే నగుదును రైతుల బ్యాంక్ అకౌంట్లలో నేరుగా జమ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. నగదు చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు తెలిపారు.
బుధవారం రాష్ట్రంలో రైతుల నుంచి శనగల కొనుగోళ్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. రబీ సీజన్ 2025-26లో పండించిన శనగలను కొనుగోలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. శనగలను కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని, దీని ప్రకారం ఫిబ్రవరి 18 నుంచి సీఎం యాప్ ద్వారా అన్ని జిల్లాల్లో కొనుగోళ్లు చేపడతామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు ప్రకారం రైతుల నుంచి కొనుగోలు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా రబీ సీజన్లో 3.25 లక్షల హెక్టార్లలో శనగల సాగు జరిగింది. ఇందులో భాగంగా దాదాపు 3.77 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరిగినట్లు ప్రభుత్వం అంచనా వేసింది. రైతు భరోసా కేంద్రాల్లో రైతులు ముందుగా తమ పంటను నమోదు చేయించుకోవాలి. సీఎం యాప్ ద్వారా వీటి కొనుగోళ్లు చేడతారు. కొనుగోలు చేసిన శనగలను గోదాముల్లో నిల్వ చేస్తారు. అనంతరం 15 రోజుల్లోనే సొమ్మును రైతులకు అందిస్తారు.
రైతు సేవా కేంద్రాల్లో వీటి కొనుగోళ్లు జరుగుతాయని అచ్చెన్నాయుడు సూచించారు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కొనుగోళ్ల పర్యవేక్షణ ఉంటుంది. ఇప్పటికే కొనుగోళ్లకు సంబంధించి పలు గైడ్లైన్స్ను ప్రభుత్వం జారీ చేసింది. వ్యవసాయం, మార్కెటింగ్, ఏపీ మార్క్ఫెడ్, సివిల్, లీగల్ మెట్రాలజీ, సప్లైస్ తదితర శాఖల సమన్వయంతో రైతు సేవా కేంద్రాల్లో శనగల కొనుగోళ్లు జరుగుతాయని తెలిపారు.
