Thursday, September 11, 2025
ePaper
spot_img
Homeతెలంగాణఈడీ విచారణకు నటి మంచు లక్ష్మి

ఈడీ విచారణకు నటి మంచు లక్ష్మి

అక్రమ బెట్టింగ్ యాప్‌ల కేసులో ఈడీ దర్యాప్తు వేగం

అక్రమ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో నటి, నిర్మాత మంచు లక్ష్మీ ప్రసన్న బుధవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. సమాచారం ప్రకారం, బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కు సంబంధించిన ఒప్పందాలు, అందుకు పొందిన పారితోషికం, అలాగే ఇతర ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో భాగంగా మంచు లక్ష్మీ వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసే అవకాశముంది. కాగా, ఇదే కేసులో నటులు ప్రకాశ్ రాజ్ (జూలై 30), విజయ్ దేవరకొండ (ఆగస్టు 6), రానా దగ్గుబాటి (ఆగస్టు 11) ఈడీ ఎదుట హాజరై సుమారు 4–5 గంటల పాటు వివరణ ఇచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నమోదైన ఐదు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్–1867 మరియు మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద దర్యాప్తు జరుపుతోంది. మొత్తం 29 మంది నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. గత విచారణల్లో, తాము చట్టబద్ధంగా అనుమతించిన ఆన్‌లైన్ స్కిల్-బేస్డ్ గేమ్‌లను మాత్రమే ప్రచారం చేశామని రానా, విజయ్ దేవరకొండ తెలిపారు. గేమింగ్ యాప్‌కు ప్రమోషన్ చేసినప్పటికీ ఎలాంటి పారితోషికం తీసుకోలేదని ప్రకాశ్ రాజ్ ఈడీకి చెప్పినట్లు సమాచారం. ఈ కేసులో మరికొంత మంది సినీ ప్రముఖులను కూడా ఈడీ విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News