రిలయెన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ(Mukesh Ambani), ఆయన కుమారుడు, రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాష్ అంబానీ (Aakash Ambani) సౌత్ కొరియా (South Korea) రాజధాని సియోల్లో శామ్సంగ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లీ జే-యోంగ్(Lee Jae-yong)తో భేటీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. రెండు సంస్థల మధ్య భాగస్వామ్యం, ఇతర రంగాల్లోకి కంపెనీల విస్తరణ తదితర అంశాలపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..
రిలయెన్స్, శామ్సంగ్ సంస్థల అధినేతల మధ్య ఇటీవల జరిగిన సమావేశం గురించి ‘ది కొరియా టైమ్స్’, ‘ది చోసన్ డైలీ’ రిపోర్ట్ చేశాయి. ఈ మీటింగ్లో శామ్సంగ్ సంస్థల ప్రతినిధులు ముఖేష్ అంబానీకి పలు కీలక వ్యాపార పరిణామాల గురించి వివరించారు. ఎలక్ట్రానిక్స్, డిస్ప్లే, ఎస్డీఐ, సీ అండ్ టీ, హెవీ ఇండస్ట్రీస్, ఈ అండ్ ఏ, హ్యూమన్ రీసోర్సెస్ డెవలప్మెంట్ సెంటర్, ఎక్స్టెండెడ్ రియాల్టీ హెడ్సెట్, మైక్రో ఆర్జీబీ డిస్ప్లే టెక్నాలజీపై స్పెషల్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇండియాలోని అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన రిలయెన్స్ ప్రస్తుతం సరికొత్త రంగాల్లోకి శరవేగంగా విస్తరిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, డేటా సెంటర్లు వంటి వాటిలోకి ప్రవేశిస్తోంది.
ఇప్పటికే శామ్సంగ్ తనదైన ముద్ర
ఏఐతోపాటు డేటా సెంటర్ సెక్టార్లలో ఇప్పటికే శామ్సంగ్ మరియు దాని అనుబంధ సంస్థలు బలమైన ఉనికిని కలిగి ఉన్నాయి. శామ్సంగ్, జియో మధ్య చాలా కాలంగా అనుబంధం ఉంది. ఈ సౌత్ కొరియా సంస్థ.. రిలయెన్స్తో 2012లోనే భాగస్వామ్యాన్ని ఏర్పర్చుకుంది. దేశవ్యాప్తంగా 4జీ నెట్వర్క్ను నిర్మించేందుకు చేతులు కలిపింది. 5జీ కార్యక్రమాలకు సంబంధించి ఇండియన్ టెలికం ఆపరేటర్లతో కలిసి పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో 6జీ నెట్వర్క్ ఎక్విప్మెంట్, ఏఐ డేటా సెంటర్స్, ఈ కేంద్రాలకు కావాల్సిన ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ వంటి రంగాల్లో కూడా లోతుగా విస్తరించాలని శామ్సంగ్ ఆశిస్తున్నట్లు ‘ది కొరియా టైమ్స్’ పేర్కొంది.
