- కొండారెడ్డిపల్లిలో రైతుల ఆగ్రహం..
- హైదరాబాద్ జాతీయ రహదారిపై మెరుపు ధర్నా..
- ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటలు పాడుతూ నిరసన..
నాగర్కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లిలో శ్రీశైలం – హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు చేపట్టిన మెరుపు ధర్నా(Farmers Protest) రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే సొంత నియోజకవర్గం, అందునా ఆయన స్వగ్రామంలోనే విద్యుత్ సరఫరా కుప్పకూలడం పాలకుల వైఫల్యానికి అద్దం పడుతోంది.
వ్యవసాయానికి కేవలం 6 నుంచి 8 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తుండటంతో, అప్పులపాలై వేసిన పంటలు కళ్ల ముందే ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ రహదారిపై బైఠాయించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. తెలంగాణ సాధించుకున్నది నిరంతరం సాగునీరు, నిర్విరామ కరెంట్ కోసమేనని, నేడు మళ్లీ చీకటి రోజులు రావడం తీవ్ర పురోగమనం నుంచి తిరోగమన మార్పుకు నిదర్శనమని రైతులు మండిపడుతున్నారు.(epaper.aadabhyderabad.in)
24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. అన్నదాతల కన్నీళ్లను చూసైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యుత్ కోతల సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ఎలాంటి తెలంగాణ ఎలా అయింది…? పురోగమనం నుంచి తిరోగమనమా అంటూ విశ్లేషకులు అంటున్నారు..
