- మోసపూరిత వెబ్ సైట్స్ పట్ల జాగర్త..
- తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు..
తిరుమలకు వచ్చే భక్తులను తిరుపతి జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తం చేస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు దర్శనం, వసతి, ప్రత్యేక ప్రవేశ దర్శనం, సేవా టికెట్లతో ఇతర సేవల కోసం అధికారిక వెబ్సైట్, అధికారిక మొబైల్ యాప్ ద్వారా పొందాలని కోరుతోంది. భక్తుల విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని కొందరు సైబర్ నేరగాళ్లు టీటీడీ అధికారిక వెబ్సైట్ను పోలి ఉండే నకిలీ వెబ్సైట్లు, మొబైల్ యాప్లు, సోషల్ మీడియా లింకులను రూపొందించి భక్తులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అలర్ట్ చేస్తోంది.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న “ttddevasthanam.online” వంటి నకిలీ వెబ్సైట్లలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి దర్శనం, సేవా టికెట్లు అందుబాటులో ఉన్నట్లు తప్పుడు ప్రచారం జరుగుతున్నట్లు పోలీసు యంత్రాంగం గుర్తించింది. ఈ మేరకు భక్తుల నుంచి నగదు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించడం జరిగిందని ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా పోలీసు శాఖ, టీటీడీ విజిలెన్స్ విభాగంతో సమన్వయంతో మోసపూరిత వెబ్సైట్లు, సోషల్ మీడియా లింకులు, ఇతర అనుమానాస్పద ఆన్లైన్ కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగుతోంది.
ఇప్పటి వరకు తిరుమలలోని వివిధ గెస్ట్హౌస్లు, వసతి సదుపాయాల పేర్లతో రూపొందించిన 32 నకిలీ వెబ్సైట్లను గుర్తించి, సంబంధిత డొమైన్ సర్వీస్ ప్రొవైడర్ల సహకారంతో తొలగించింది. అయినా సైబర్ నేరగాళ్లు కొత్త పేర్లు, కొత్త డొమైన్లతో నకిలీ వెబ్సైట్లను మళ్లీ సృష్టిస్తూ భక్తులను మోసం చేసేందుకు ప్రయత్నించే అవకాశం ఉన్నందున తిరుమలకు వచ్చే ప్రతి యాత్రికుడు ఆన్లైన్ బుకింగ్ల విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని తిరుపతి జిల్లా పోలీసు శాఖ సూచిస్తుంది.
