- కేంద్రమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్కు సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి
పీఎంఏవై (గ్రామీణ) 2.0 పథకం కింద తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి కోరారు. దిల్లీలో కేంద్రమంత్రితో భేటీ అయిన ఆయన, గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో గ్రామీణ గృహనిర్మాణం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని వివరించారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు వీలుగా ఉపాధి హామీ పథకంలో పది కొత్త పనులను చేర్చాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.

ముఖ్యంగా కూరగాయల పందిళ్లు, పశుగ్రాస ప్లాట్లు, మల్బరీ తోటలు, పట్టు పురుగుల పెంపక షెడ్లకు అనుమతివ్వడంతో పాటు రైతుల భూముల అభివృద్ధి, నీటి సంరక్షణ, ప్రకృతి విపత్తుల వల్ల దెబ్బతిన్న వ్యవసాయ భూముల పునరుద్ధరణ పనులకు అవకాశం కల్పించాలని కోరారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఉపాధి హామీ జాబితాలో చేర్చి, లబ్ధిదారులకు 90 రోజుల పాటు పని కల్పించేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేంద్రమంత్రికి విన్నవించారు.
