HomeజాతీయంResignation | యువత ఆగ్రహం ఫలించిందా?

Resignation | యువత ఆగ్రహం ఫలించిందా?

  • ధర్మేంద్ర ప్రధాన్ పదవికి గుడ్ బై..

దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల అవకతవకల ఆరోపణలు, ముఖ్యంగా నీట్ – యూజీ 2026 పరీక్ష వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారిన వేళ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన రాజీనామాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సమర్పించినట్లు శనివారం ప్రకటించారు. సోషల్ మీడియా వేదిక Xలో విడుదల చేసిన సుదీర్ఘ లేఖలో ధర్మేంద్ర ప్రధాన్, ఇది తన వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదని, దేశ యువత భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు.

యువత భవిష్యత్తే ప్రధానం :

- Advertisement -

“నాలుగు దశాబ్దాలకు పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యా సంస్కరణల కోసం పనిచేశాను. దేశ యువత ఆకాంక్షలు, వారి కలలు నాకు అత్యంత విలువైనవి. భారత యువశక్తే దేశానికి నిజమైన బలం” అని ఆయన పేర్కొన్నారు.

నీట్ అవకతవకలపై చర్యలు :

మే 3న జరిగిన నీట్ -యూజి 2026 పరీక్షలో అవకతవకలు వెలుగులోకి రావడంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించిందని తెలిపారు. పరీక్షను రద్దు చేసి, కేసును సీబీఐకి అప్పగించడంతో పాటు, పునఃపరీక్ష నిర్వహించినట్లు గుర్తు చేశారు. ఇకపై నీట్ పరీక్షను కంప్యూటర్ ఆధారిత (సిబిటి) విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు.

“పరీక్ష మాఫియాకు విద్యార్థులు బలికావద్దు”

ఏ ప్రతిభావంతుడైన విద్యార్థి కూడా పరీక్ష మాఫియా కారణంగా నష్టపోకూడదని తాను మొదటి రోజు నుంచే పూర్తి బాధ్యత తీసుకున్నానని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రుల సహకారంతో పునఃపరీక్ష విజయవంతంగా పూర్తయ్యిందన్నారు.

నిరసనల మధ్య రాజీనామా

గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలు, విద్యార్థుల్లో ఏర్పడిన ఆందోళన తనను తీవ్రంగా కలిచివేశాయని పేర్కొన్నారు. జంతర్ మంతర్ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితిని దేశ వ్యతిరేక శక్తులు దుర్వినియోగం చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో, అలాగే విద్యార్థుల భవిష్యత్తు చట్టపరమైన చిక్కుల్లో పడకుండా కాపాడాలనే లక్ష్యంతో రాజీనామా చేసినట్లు వెల్లడించారు.
ప్రధానికి కృతజ్ఞతలు తనకు కేంద్ర మంత్రిగా సేవ చేసే అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోడీకి ధర్మేంద్ర ప్రధాన్ కృతజ్ఞతలు తెలిపారు. మంత్రివర్గ సహచరులు, విద్యాశాఖ అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా దేశ సేవకు అంకితమై ఉంటానని చెప్పారు.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత కేంద్ర విద్యాశాఖకు కొత్త మంత్రి బాధ్యతలు చేపట్టనున్నారు. కొత్త మంత్రి పరీక్షా వ్యవస్థలో సంస్కరణలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరుపై సమీక్ష, విద్యార్థుల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించే చర్యలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు భావిస్తున్నారు.

దేశవ్యాప్తంగా ఆసక్తి :

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. దేశంలోని అతిపెద్ద ప్రవేశ పరీక్షల్లో ఒకటైన నీట్ కు సంబంధించిన ఈ పరిణామం, భవిష్యత్తులో జాతీయ స్థాయి పోటీ పరీక్షల నిర్వహణపై కీలక ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News