- తక్షణ చర్యలకు ఆదేశాలు..
పట్టణంలోని సోఫీ నగర్ 14వ వార్డ్లో నెలకొన్న పారిశుధ్య సమస్యలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మురుగు నీరు నిల్వ ఉండటం, చెత్త సకాలంలో తొలగించకపోవడం వల్ల వార్డ్లో అస్వచ్ఛత పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాలికి చెత్త ఎగిరి ఇళ్ల పరిసరాల్లో పడటం, తడి చెత్త పేరుకుపోవడం వల్ల దోమలు, ఈగలు అధికమై మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల భయం నెలకొంది.


ఈ సమస్యల పరిష్కారం కోసం స్థానికులు మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తిని వారి కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ ఆదేశాలు ఉన్నప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదని తెలిపారు.


అయితే ప్రజల సమస్యలను ఓర్పుతో విన్న వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి వెంటనే స్పందిస్తూ సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. కాలనీలోని డ్రైనేజీలను అత్యవసరంగా శుభ్రపరచాలని, చెత్త తొలగింపు పనులను క్రమం తప్పకుండా నిర్వహించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఆరోగ్యం తనకు అత్యంత ప్రాధాన్యమని పేర్కొంటూ సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. వెంటనే చర్యలు ప్రారంభించడంతో కాలనీవాసులు వైస్ చైర్మన్ స్పందనపై సంతృప్తి వ్యక్తం చేస్తూ సమస్యల పరిష్కారానికి ఆయన చూపిన చొరవను అభినందించారు.
