- దేశవ్యాప్తంగా సమస్యలు..
దేశంలో డిజిటల్ చెల్లింపు సేవలకు బుధవారం తీవ్ర అంతరాయం ఏర్పడింది. యూపీఐ ప్లాట్ఫామ్స్ ద్వారా లావాదేవీలు చేసేందుకు ప్రయత్నించిన అనేక మంది వినియోగదారులు ట్రాన్సెక్షన్లు సరిగా జరుగక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవల్లో సమస్య ఎక్కువగా కనిపించింది. ఔటేజ్ ట్రాకింగ్ ప్లాట్ఫామ్ డౌన్డిటెక్టర్ ప్రకారం.. ఒక్కసారిగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఒక్క ఎస్బీఐ ఖాతాదారుల నుంచే 500కు పైగా ఔటేజ్ రిపోర్టులు రాగా..
యూకో బ్యాంకుకు సంబంధించి దాదాపు 40 ఫిర్యాదులు నమోదయ్యాయి. న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, జైపూర్, పుణె వంటి ప్రధాన నగరాలతోపాటు కోల్కతా, గువాహటి, చెన్నై నుంచి కూడా వినియోగదారులు లావాదేవీలు విఫలమయ్యాయని ఫిర్యాదులు వచ్చాయి. ఈ సమస్యపై చాలామంది ఎక్స్ వేదికగా తమ అసహనాన్ని వ్యక్తంచేశారు. కొందరి లావాదేవీలు మధ్యలోనే ఆగిపోగా, మరికొందరి యూపీఐ యాప్లు పూర్తిగా లోడ్ కాలేదు.
అయితే ఈ అంతరాయంపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పందించింది. షెడ్యూల్ ప్రకారం చేపట్టిన నిర్వహణ పనుల సమయాన్ని ఏప్రిల్ 1వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటల వరకు పొడిగించినట్లు తెలిపింది. ఈ సమయంలో యూపీఐ, ఐఎంపీఎస్, యోనో, ఇంటర్నెట్ బ్యాంకింగ్, నెఫ్ట్, ఆర్టీజీఎస్ సేవల్లో అంతరాయం కలుగవచ్చని పేర్కొన్నది. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని, వినియోగదారులు యూపీఐ లైట్, ఈ-రూపీ (సీబీడీసీ) యాప్, ఏటీఎం సేవలను ప్రత్యామ్నాయంగా వాడుకోవాలని సూచించింది.
