- వాకౌట్ చేసిన వైసీపీ సభ్యులు..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. బుధవారం పార్లమెంట్ సమావేశంలో బిల్లుపై దాదాపు రెండు గంటల పాటు చర్చ జరిగింది. కూటమికి చెందిన టీడీపీ, బీజేపీ, జనసేన సభ్యులతో పాటు వైసీపీ సభ్యులు మినహా ఇతర పార్టీలకు చెందిన సభ్యులు మద్దతు పలికారు. దీంతో అత్యధిక సభ్యుల మద్దతు ప్రకారం చైర్మన్ ఆమోదం తెలుపడంతో సభ్యులు హర్షధ్వనాలు వ్యక్తం చేశారు. గురువారం రాజ్యసభలో బిల్లును ప్రవేశ పెట్టనున్నారు.
ఈ సందర్భంగా వైసీపీ సభ్యులు ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రస్తుత స్థితిలో ఉన్న బిల్లుకు తాము వ్యతిరేకమని వైసీసీ పార్లమెంట్ సభ్యుడు మిథున్రెడ్డి తెలిపారు. రాజధానిని ఎప్పటివరకు నిర్మిస్తారో ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం లేదని పేర్కొన్నారు. రైతుల వద్ద నుంచి సుమారు 54 వేల ఎకరాలు సేకరించారని వెల్లడించారు.
రాష్ట్ర విభజన తరువాత ఏపీకి కొత్త రాజధాని అవసరం ఏర్పడిందని బీజేపీ సభ్యురాలు పురందరేశ్వరి అన్నారు. రాజధాని నిర్మాణానికి నాడు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. రాజధాని లేని రాష్టంగా ఏపీ తన ప్రస్థానాన్ని ప్రారంభించిందని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో రాజధాని అంశం అస్థిరత ఏర్పడిందని పేర్కొన్నారు. అమరావతి రాజధాని కోసం 29వేల మంది రైతులు తమ భూములనుఇచ్చేందుకు ముందుకు వచ్చారని వివరించారు. ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుందని స్పష్టం చేశారు.
