- స్వయంభు శివలింగాన్ని విచ్చిన్నం చేసిన అఫ్గానిస్థాన్ పాలకుడు మొహమ్మద్ గజిని
- కాపాడుకుంటూ వచ్చిన దక్షిణ భారత అగ్నిహోత్ర బ్రాహ్మణ కుటుంబం.
- ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, సత్సంగం.
- ఆ శివలింగ మూర్తులకు నిన్న నారాయణగూడ కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థలో వైభవంగా జరిగిన పూజాధి కార్యక్రమాలు.
అత్యంత అరుదైన, చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన అసలైన సోమనాథ జ్యోతిర్లింగపు పవిత్ర శకలాలను భక్తుల దర్శనార్థం హైదరాబాదుకు తెచ్చామని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ తెలిపింది. భక్తుల సందర్శనార్థం ఈ జ్యోతిర్లింగ శకలాలు అందుబాటులో ఉంచబడతాయి.
ఈ సందర్భంగా వేలాది భక్తుల సమక్షంలో మహారుద్రాభిషేకం, అనంతరం దివ్య సత్సంగం నిర్వహింప బడుతున్నాయి.
దాదాపు వేయి సంవత్సరాల క్రితం ఘజినీ మహమ్మద్ దాడిలో సోమనాథ దేవాలయం ధ్వంసమైన కాలంలో దక్షిణభారతానికి చెందిన అగ్నిహోత్ర బ్రాహ్మణులు ఆ లింగ శకలాలను రహస్యంగా తీసుకువచ్చి, వంశపారంపర్యంగా పూజిస్తూ కాపాడుతూ వచ్చి, ఇటీవలే వాటిని గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ సన్నిధికి సమర్పించి, వాటికి పునర్వైభవం తేవలసిందిగా కోరారు.
సోమనాథ పవిత్ర మూర్తులు ఈకాలంలోనే ప్రపంచానికి వెల్లడికావటం గురించి గురుదేవులు మాట్లాడుతూ, “సృష్టి, స్థితి, లయ, తిరోభావ (రహస్యంగా ఉండటం), అనుగ్రహ అనే ఐదు లక్షణాలు శివునికి ఆపాదించబడ్డాయి. దాదాపు వేయి సంవత్సరాలపాటు రహస్యంగా దాగి ఉన్న అనంతరం, శివుడు ఇప్పుడు తనను తాను వెల్లడించుకున్నాడు. ఈ పవిత్ర లింగాల రూపంలో ఉన్న అతని ఉనికి, శివునికి నాశనం అనేది లేదనే సత్యాన్ని నిరూపిస్తుంది. అతను శాశ్వతుడు.” అని పేర్కొన్నారు.
పన్నెండు జ్యోతిర్లింగాలలో మొదటగా పేర్కొనే సోమనాథ జ్యోతిర్లింగం అనేక విధ్వంసాలను తట్టుకొని భారతీయ సంస్కృతీవిశ్వాసాలకు ప్రతీకగా నిలిచింది. సం ll 2007 లో జరిపిన వైజ్ఞానిక పరిశోధనలలో, ఈ శకలాల మధ్యభాగంలో బలమైన అయస్కాంత క్షేత్రం ఉన్నదని తేలినప్పటికీ వాటిలో ఇనుము అతి తక్కువగా ఉండటం గమనార్హం. సోమనాథ లింగపు మూలపదార్థం భూమికి సంబంధించినది కాకపోవచ్చని కూడా కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.
ఈ స్వయంభూ శివలింగానికి నిన్న నారాయణగూడ కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థలు పూజాది కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి మల్లికార్జున రెడ్డి తదితరులు విశేష సేవలు అందించారు.

