- బలమైన కారణం వుందంటున్న విశ్లేషకులు..
పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ చైనా ప్రదర్శిస్తున్న వ్యూహాత్మక మౌనం వెనుక ఒక బలమైన ఆర్థిక కారణం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే బీజింగ్లోని ‘బ్యాంక్ ఆఫ్ కున్లన్’. చైనా ప్రభుత్వ రంగ సంస్థ అయిన ‘చైనా నేషనల్ పెట్రోలియం కార్పొరేషన్’ (సీఎన్ పీసీ) కింద ఇది పనిచేస్తుంది. ఇరాన్పై అమెరికా దాడులు చేసినప్పటికీ చైనా పెద్దగా స్పందించకపోవడానికి కారణం ఈ బ్యాంకింగ్ వ్యవస్థేనని వార్తా కథనాలు పేర్కొంటున్నాయి.
దశాబ్ద కాలంగా ఇరాన్ చమురు వ్యాపారానికి ఈ బ్యాంక్ ప్రధాన మార్గంగా ఉంది. అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా, ఇరాన్ తన చమురును చైనాకు విక్రయించి నిధులు పొందేలా ఈ బ్యాంక్ సహకరిస్తోంది. ఇలా కొనుగోలు చేసిన చమురును మలేసియా నుంచి కొన్నట్లు చూపిస్తూ చైనా తమ దేశంలోకి రవాణా చేస్తోంది. ఈ వ్యవహారం మొత్తం డాలర్లలో కాకుండా చైనా యువాన్లలో జరగడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు చిక్కే అవకాశం లేదు. తద్వారా ఇరాన్ డాలర్ ఆంక్షలను తప్పించుకుంటుండగా, ఇటు చైనా చౌకగా చమురును దక్కించుకుంటోంది. దీంతోపాటు అమెరికా ఆంక్షల నుంచి ఇరాన్ ను కాపాడటం ద్వారా ఆ ప్రాంతంలో అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించాలని చైనా భావిస్తోంది.
ఇరాన్కు ఆర్థికంగా సహకరిస్తున్నందుకు ఇప్పటికే అమెరికా ఈ బ్యాంక్పై ఆంక్షలు విధించింది. అయినప్పటికీ, ఇది రహస్యంగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కు నిధులు మళ్లించడానికి సహకరిస్తోందని అమెరికా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.
