- మీ ఆరోగ్యంతో ఆటలు అడకండి ..?
- అనారోగ్యాన్ని చౌకగా కొనకండి ..?
- “చౌక” మనకు లాభం అనిపిస్తుంది.
- కానీ ఆ లాభం అనారోగ్యానికి బిల్లయితే?
- ఆహారం అవసరం… కానీ భద్రత లేకపోతే శత్రువు..
నగర వ్యాప్తంగా రూ.10లకే విక్రయమవుతున్న పాలకోవ వ్యవహారం, ప్రజల ఆరోగ్య భద్రతపై మాత్రమే కాదు… ఆహార నియంత్రణ వ్యవస్థల వైఫల్యాలపై కూడా పెనుసవాలు విసురుతోంది. కొంతమంది వ్యక్తులు వాహనాలపై తిరుగుతూ, ఎక్కడపడితే అక్కడ బన్పై పాలకోవ పూసి రూ.10లకే విక్రయాలు యథేచ్ఛగా జరుపుతుంటే, సంబంధిత అధికారులు మాత్రం చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు.
రుచిగా అనిపిస్తున్న ఆ తీపి వెనుక దాగి ఉన్న పెను ప్రమాదాన్ని గుర్తించే ప్రయత్నం ఎవరిలోనూ కనిపించడం లేదు.ఇది కేవలం చౌకబారు ఆహార సమస్య కాదు… ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వ యంత్రాంగం చూపుతున్న నిర్లక్ష్యానికి అద్దం పట్టే అంశం. విచిత్రమేమిటంటే, ఈ అనుమానాస్పద పాలకోవ విక్రయాలు అధికారుల కంటికి పడడం లేదనుకోవడం పొరపాటు. వాస్తవానికి కొంతమంది ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ విక్రేతలకు పర్మిషన్లు కూడా ఇస్తున్నారన్న చేదు నిజం మరింత ఆందోళన కలిగిస్తోంది.

10 రూపాయలకు పాలకోవా ఎలా వస్తుంది?
పాల ధరలు పెరిగిన ఈ రోజుల్లో, నాణ్యమైన పాలు, చక్కెర, ఇంధనం, శ్రమ ఖర్చులతో పాలకోవా తయారు చేయడం సాధ్యమేనా అన్న సందేహం సహజమే. అప్పుడు ఆ పాలకోవా ఏ పదార్థాలతో తయారైంది? ఎవరు తయారు చేశారు? ఎప్పుడు తయారైంది? ఎక్కడ నిల్వ చేశారు? ఎక్స్పైరీ తేదీ ఏమిటి? ఇవన్నీ ఎవ్వరూ అడగరు, ఎవ్వరూ చెప్పరు.బన్ రాయిలా గట్టిగా ఉన్నా, పైన పూసిన పాలకోవా తెల్లగా మెరుస్తున్నా, చివరికి మన చేతిలోకి వెళ్లేది ఆహారమా… లేక అనారోగ్యమా అనే సందేహమే మిగిలిపోతుంది.ఇలాంటి విక్రేతలు స్థిరంగా ఒకచోట ఉండరు. తిరుగుతూ వ్యాపారం చేస్తారు. అదే వారి రక్షణ కవచం. ఎందుకంటే అక్కడ తనిఖీలు ఉండవు. ప్రశ్నలు ఉండవు. చర్యలు ఉండవు.

ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎక్కడ?
నగరంలో బహిరంగంగా, అనుమానాస్పద ఆహార పదార్థాలు అమ్ముడవుతుంటే ఫుడ్ సేఫ్టీ అధికారుల కళ్లు ఎందుకు మూసుకుపోయాయో అర్ధం కావడంలేదు ? లైసెన్సులు, నాణ్యత ప్రమాణాలు, తనిఖీలు..ఇవన్నీ కేవలం కాగితాలకే పరిమితమయ్యాయా? అనే ప్రశ్నలు వినబడుతున్నాయి..ఆహార భద్రత చట్టాలు పుస్తకాలలోనే మిగిలిపోతే, ప్రజల ఆరోగ్యాన్ని చివరకు ఎవరు కాపాడాలి? ఇలాంటి నాసిరకం ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఆహార విషబాధ, కాలేయ సమస్యలు, జీర్ణకోశ వ్యాధులు వంటి తీవ్రమైన అనారోగ్యాలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరికలు వినిపిస్తున్నాయి… చర్యలు మాత్రం కనిపించడం లేదు.ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యం మాత్రమే కాదు… ప్రజల ఆరోగ్యంతో వ్యవస్థలు చేస్తున్న ప్రమాదకర ఆట.
మన నిర్లక్ష్యం కూడా.
“పది రూపాయలే కదా” అని తేలిగ్గా తీసుకునే ఆ ఒక్క నిర్ణయమే, రేపు వేల రూపాయల వైద్య ఖర్చులకు కారణమవుతుంది. ఇప్పటికైనా గ్రేటర్ ప్రజలు ఆలోచించాలి. తినేది తీపే కావచ్చు… కానీ దాని వెనుక దాగి ఉన్న చేదు నిజాన్ని గమనించాల్సిన అవసరం ఉంది.అదే సమయంలో ప్రభుత్వ యంత్రాంగం కూడా మేల్కోవాలి. ఫుడ్ సేఫ్టీ తనిఖీలు పేరుకే కాకుండా, నిజంగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేలా ఉండాలి. లైసెన్సులేని, నాణ్యత లేని ఆహార విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలి.ఆరోగ్యం వ్యాపారం కాదు.ఆరోగ్యంతో ఆటలు ఆడితే…అది చివరకు ప్రజల ప్రాణాలతో చేసే ఆటగానే మిగిలిపోతుంది.
