- రాజీవ్ రహదారిపై ‘ట్రాఫిక్ పోలీస్ బొమ్మల’ ఏర్పాటు
కరీంనగర్:- రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు మరియు వాహనదారులను అప్రమత్తం చేసేందుకు కరీంనగర్ ఎల్ఎండీ పోలీసులు సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, తిమ్మాపూర్ మండలంలోని రాజీవ్ రహదారిపై ప్రమాదకరమైన మలుపులు, జంక్షన్ల వద్ద ట్రాఫిక్ పోలీసులను పోలి ఉండే ‘ట్రాఫిక్ పోలీస్ బొమ్మలను’ ఏర్పాటు చేశారు. అతివేగానికి కళ్లెం వేయడం వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా చూడటం, నుస్తులాపూర్ నుండి కరీంనగర్ వరకు ఉన్న ప్రధానమైన యూ-టర్న్లు, ట్రాఫిక్ జంక్షన్ల వద్ద వీటిని ఏర్పాటు చేస్తున్నారు.
అవసరమైన చోట్ల 30 స్టాపర్లతో పాటు, ప్రయోగాత్మకంగా మొత్తం 6 ట్రాఫిక్ పోలీస్ బొమ్మలను ఏర్పాటు చేశారు. దూరం నుండి చూస్తే సాక్షాత్తు ట్రాఫిక్ పోలీసులే విధుల్లో ఉన్నట్లుగా కనిపించడంతో వాహనదారులు అప్రమత్తమై, వేగాన్ని తగ్గించి జాగ్రత్తగా వెళ్తారని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదాల నివారణ కోసమే శాఖాపరంగా ఈ చర్యలు చేపట్టామని, వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు కోరారు.
