- చివ్వెంల పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ.
- సిబ్బందితో సమీక్ష, పిర్యాదుదారులతో మాట్లాడి.
- ప్రజలకు అందుబాటులో ఉండే విజువల్ పోలీసింగ్ పై దృష్టి.
- జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ.
చివ్వెంల: ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం చేయొద్దని జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ అన్నారు. మంగళవారం చివ్వెంల పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించి, స్టేషన్ పనితీరును పరిశీలించారు. సిబ్బంది విధి నిర్వహణ, స్టేషన్ పరిసరాలు, రికార్డుల నిర్వహణ, ఫిర్యాదుల స్వీకరణ విధానం వంటి అంశాలను ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్ వద్ద ఉన్న పిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలు, ఫిర్యాదుల పరిష్కార స్థితి గురించి వివరాలు తెలుసుకున్నారు.
ప్రజలతో మర్యాదగా, గౌరవంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. పోలీసులు పౌరులకు నమ్మకం కలిగించే విధంగా పనిచేయాలి. ప్రతి ఫిర్యాదు పై వెంటనే స్పందించి, విచారణను వేగంగా పూర్తి చేయాలి. కేసుల నమోదులో జాప్యం ఉండకూడదని ఎస్పీ ఆదేశించారు.ఫిర్యాదుల నిర్వహణలో పారదర్శకత పాటించాలని, ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండే విధంగా విజువల్ పోలీసింగ్ నిర్వహించాలన్నారు. డయల్ 100 ఫిర్యాదులపై ప్రాధాన్యతగా స్పందించాలి.

సిబ్బంది జట్టుగా పనిచేసి ప్రజా రక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు.రాత్రి వేళల్లో పెట్రోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలని, జాతీయ రహదారి వెంట నిఘా బలోపేతం చేయాలని, రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించి ప్రమాదాలను నివారించాలన్నారు.సిబ్బందికి ఎలాంటి వ్యక్తిగత లేదా సేవా సమస్యలు ఉన్నా ఉన్నతాధికారుల దృష్టికి వెంటనే తీసుకురావాలని ఎస్పీ నరసింహ సూచించారు.ఈ సందర్శనలో ఎస్ఐ మహేశ్వర్, సిబ్బంది తదితరులు ఉన్నారు.
