దాడులను సమర్థించుకున్న నెతన్యాహు
హమాస్ కీలక నేతలే లక్ష్యంగా ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయెల్ చేసిన దాడులను పలు దేశాలు ఖండించాయి. అయితే, ఈ దాడులను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సమర్థించుకున్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ చేసిన దాడులను.. అమెరికా లో జరిగిన 9/11 దాడులతో పోల్చారు. గురువారం ఆయన ఓ వీడియోలో మాట్లాడారు. హమాస్తో యుద్ధానికి దారితీసిన అక్టోబరు 7 నాటి దాడులను ఆయన ప్రస్తావించారు. వీటిని అమెరికాలో జరిగిన 9/11 దాడులతో పోల్చుతూ.. నాడు యూఎస్ ఎలా స్పందించిందో ప్రస్తుతం తాము అలాగే చేశామన్నారు. దాడుల తర్వాత వాటికి కారణమైన ఉగ్రవాదులు ఏ దేశంలో ఉన్నా వెంటాడి హతమారుస్తామని నాడు అమెరికా చెప్పింది. దీనిపై ఐక్యరాజ్యసమితిలో తీర్మానం కూడా చేసింది. ఇప్పుడు మేము అదే చేశాం’ అని నెతన్యాహు పేర్కొన్నారు.
ఈసందర్భంగా అఫ్గానిస్థాన్లో అల్-ఖైదా ఉగ్రవాదులను వెంటాడి, అనంతరం పాకిస్థాన్లో ఉన్న కరుడుగట్టిన ఉగ్రవాది, అల్ఖైదా నేత ఒసామా బిన్లాడెన్ ను అమెరికా బలగాలు చంపేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తమ చర్యలను ఖండిస్తున్న పలు దేశాలను నెతన్యాహు తప్పుబట్టారు. ఆత్మరక్షణ కోసం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తాము కట్టుబడి ఉన్నామన్నారు. ఇందుకు తమను ప్రశంసించాల్సింది పోయి.. తప్పుబడుతున్నారంటూ అసహనం వ్యక్తంచేశారు. మరోవైపు.. ఖతార్ పై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. హమాస్ కు ఆ దేశం సురక్షితమైన స్వర్గధామంగా మారిందన్నారు. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తోందన్నారు. ఖతార్తో సహా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే దేశాలను ఈసందర్భంగా ఆయన హెచ్చరించారు.
అలాంటివారిని బహిష్కరించాలని, లేదంటే చట్టం ముందు నిలబెట్టాలన్నారు. అలా చేయకపోతే.. ఇజ్రాయెల్ చర్యలకు దిగుతుందన్నారు. కాల్పుల విరమణకు సంబంధించి యూఎస్ ప్రతిపాదన మేరకు దోహాలో ఖతార్ అధికారులు, హమాస్ నేతలు భేటీ అయ్యారు. వీరి మధ్య చర్చలు జరుగుతుండగానే ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడిరది. ఈ దాడుల్లో వారెవరూ ప్రాణాలు కోల్పోలేదు. అయితే, ఈ దాడులను ఖతార్ తీవ్రంగా పరిగణించింది. భారత్తో సహా పలు దేశాలు ఈ దాడులను ఖండించాయి.