- రిక్టర్ స్కేలుపై 4.4 గా తీవ్రత నమోదు..
- పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు..
- ఆఫ్ఘనిస్తాన్ లో తరచూ భూమి కంపిస్తుందన్న అధికారులు..
కాబూల్ :
అఫ్గానిస్థాన్లోని ఫైజాబాద్లో భూకంపం సంభవించింది. సోమవారం ఉదయం 7.08 గంటలకు ఫైజాబాద్లో స్వల్పంగా భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4 గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకటించింది. ఫైజాబాద్కు 196 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని తెలిపింది. భూ అంతర్భాగంలో 158 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది.. కాగా, భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. గత నెల 28న కూడా ఫైజాబాద్లో భూమి కంపించింది. 4.8 తీవ్రతతో భూకంపం నమోదయింది. ఇక ఆగస్టు 5న హిందూకుష్ పర్వత శ్రేణుల్లో 5.8 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. దీని ప్రభావంతో ఢిల్లీ, జమ్ముకశ్మీర్, పాకిస్థాన్లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. కాగా, అఫ్గానిస్థాన్లో తరచూ భూకంపాలు సంభవిస్తాయి. ప్రత్యేకంగా హిందూకుష్ పర్వత ప్రాంతాల్లో యూరేసియన్, ఇండియన్ టెక్టోనిక్ ఫలకాల మధ్య రాపిడి తలెత్తి భూకంపానికి కారణమవుతున్నాయి.