సిద్దిపేట : వివాహం అయిన మరుసటి రోజే విద్యుత్ షాక్తో వరుడు మృతి చెందిన హృదయ విదారకర సంఘటన జిల్లాలోని సిద్దిపేట అర్బన్ మండలం వెంకటాపుర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..గ్రామానికి చెందిన నిరంజన్ సిద్దిపేటలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. కొన్నేళ్లుగా సిద్దిపేట పట్టణంలో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. కాగా, సోమవారం పెళ్లి రిసెప్షన్ జరగాల్సి ఉండగా.. ఉదయం తాను ఉంటున్న ఇంటి వద్ద రిసెప్షన్ కోసం ఏర్పాటు చేసిన లైటింగ్ తీగలు తగిలి వరుడు మృతి చెందాడు. దీంతో ఇటు ఉపాధ్యాయుల్లో, అటు స్వగ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇరు కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. జీవితాంతం తోడుంటానని మూడుముళ్లు వేసిన భర్త అకాల మరణంతో వధువు కన్నీరుమున్నీరుగా విలపించడం స్థానికులను కలచివేసింది.