- ఆస్తి విషయంలో కోర్టు స్టే ఉన్నా పనులు కొనసాగుతున్నాయన్న ఆరోపణ
జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలోని గాంధీ నగర్ ప్రాంతంలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ అక్రమ నిర్మాణం చేపడుతున్నారని బాధితురాలు నర్సమ్మ కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు. తనకు చెందిన హౌస్ నం 27-1043/1/A/1, సర్వే నం 327లోని 400 గజాల స్థలాన్ని 2017లో చట్టబద్ధంగా కొనుగోలు చేసామని తెలిపారు. తమ పేరున కరెంట్ మీటర్, మున్సిపల్ టాక్స్ రసీదులు, వాటర్ బిల్లులు ఉన్నాయని, ఆ స్థలంపై పూర్తి హక్కులు తమవేనని పేర్కొన్నారు.

అదే ప్రాంతానికి చెందిన మహమ్మద్ హబీబా బేగం కుటుంబ సభ్యులు చెడు ఉద్దేశంతో తమ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు లో దాఖలైన రిట్ పిటిషన్ నం 19642/2024లో తమ పక్షాన ఆదేశాలు వచ్చాయని చెప్పారు. అలాగే కుషాయిగూడ సివిల్ కోర్టు లో ఓఎస్ నం 1104/2024, ఐఏ నం 439/2024లో 23-02-2026న ఇంజంక్షన్ ఆర్డర్ జారీ అయిందని వివరించారు.


రెండు పక్షాలు ప్రశాంతంగా ఉండాలని, ఎటువంటి నిర్మాణ పనులు చేపట్టరాదని కోర్టు స్పష్టంగా స్టే ఇచ్చినప్పటికీ, ఫిబ్రవరి 10న ప్రత్యర్థులు నిర్మాణాన్ని ప్రారంభించారని నర్సమ్మ వాపోయారు. ఈ విషయమై జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించగా, ఇది సివిల్ వివాదమని చెప్పి చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు.
కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ జరుగుతున్న నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేసి, అక్రమంగా నిర్మించిన భాగాలను కూల్చివేయించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ను వినతిపత్రంలో కోరారు.
