- బిజెపితో బిఆర్ఎస్ లోపాయకారి మద్దతు
- రైతులు ఆందోళన చెందుతున్నా కేంద్రం రాజకీయం
- మండిపడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్
- ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బిఆర్ఎస్ ఎటువైపో చెప్పాలని డిమాండ్
కేందప్రభుత్వం యూరియా ఇవ్వలేదని, అందుకే సమస్యలు వస్తున్నాయని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే యూరియా కొరత వచ్చిందని ఆరోపించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్రావుకి ఎరువుల గురించి ఏవిూ తెలియదని విమర్శించారు. రాంచందర్రావు సోయి లేకుండా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. ఆయనకు రాజకీయ విమర్శలు తప్పా, రైతుల సమస్యలు పట్టవా? అని ప్రశ్నించారు. యూరియా కోసం ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారా..? అని నిలదీశారు. సీఎం రేవంత్రెడ్డితో సహా మంత్రులు, ఎంపీలు యూరియాపై కేంద్ర ప్రభుత్వం పెద్దలను కలసి విజ్ఞప్తి చేశారని గుర్తుచేశారు. యూరియా ఉత్పత్తి, సరఫరా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందని చెప్పుకొచ్చారు. సోమవారం గాంధీభవన్లో మంత్రి పొన్నం ప్రభాకర్ విూడియాతో మాట్లాడారు. రైతు రుణమాఫీ, సన్నవడ్లకు బోనస్ ఇవ్వడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు పాజిటివ్గా ఉన్నారని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో యూరియా కొరత ఉందని.. దాన్ని ఆసరాగా చేసుకుని బీజేపీ, బీఆర్ఎస్లు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయని మండిపడ్డారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉత్పత్తి ఆపేశారని గుర్తుచేశారు.
తెలంగాణ బీజేపీ ఎంపీలు యూరియా కొరతకు బాధ్యత వహించాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. యూరియా సమస్యను పరిష్కరించేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఎరువుల అంశంపై సంబంధిత కేంద్ర మంత్రి స్పందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున పోరుబాట పడుతామని పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. ఎరువుల కొరతతో రైతులు ఆందోళనలో ఉన్నారని మంత్రి తెలిపారు. ఎరువుల విషయంలో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని అన్నారు. ఎరువుల తయారీ, సరఫరాపై పూర్తి ఆధిపత్యం కేంద్రానిదే అని రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత రావాలనేది ఉద్దేశం కాదని చెప్పారు. బిజెపితో బిఆర్ఎస్ కుమ్మక్కయి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎరువుల సమస్య ఉందనేది వాస్తవం అని పేర్కొన్నారు. ఎరువుల బాధ్యత వహించాల్సిన వాళ్లు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని, క్షేత్రస్థాయిలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు.
రైతులకు సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏవిూ లేదని అన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్దేశపూర్వకంగా 4 నెలలుగా ఉత్పత్తి జరగట్లేదని విమర్శించారు. రామగుండం కర్మాగారం ఉత్పత్తి చేసి ఎరువులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని, రాష్టాన్ర్రికి 11 లక్షల టన్నులకు గాను 5.2 లక్షల టన్నుల ఎరువులే వచ్చాయని తెలియజేశారు. ఎరువుల వైఫల్యం బాధ్యత బిజెపి తీసుకోవాల్సిందేనని రాజకీయ కక్ష ఉంటే రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులపై తీర్చుకోవాలని సూచించారు. రైతుల సహకారంతో బిజెపికి వ్యతిరేకంగా ఒత్తిడిని తెస్తామని పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు- ఎటువైపో చెప్పాలని పొన్నం ప్రభాకర్ బిఆర్ఎస్కుప్రశ్నల వర్షం కురిపించారు. తమ ప్రభుత్వంపై బీజేపీ , బీఆర్ఎస్ కుమ్మకై కుట్ర చేస్తున్నాయని ధ్వజమెత్తారు.