ప్రజల ప్రాణాలతో వ్యాపారుల చెలగాటం
డ్రగ్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి
ఫార్మాసిస్ట్ సంక్షేమ సంఘం డిమాండ్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫార్మాసిస్ట్ (Farmacist) సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నేరెడ్మెట్ చౌరస్తాలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఔషధాల విక్రయం (Medicines Sales), సంబంధిత అంశాలపై చర్చించారు. ఫార్మసీ సర్టిఫికెట్ కలిగిన, అర్హత గల వ్యక్తులు మాత్రమే మందులు అమ్మాలనే నిబంధన ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి అర్హత లేని వారు కూడా బహిరంగంగా మందులు విక్రయిస్తున్నారని సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ “ప్రజల ఆరోగ్యం (Public Health), ప్రాణాలు ఔషధాలపై ఆధారపడి ఉంటాయని, సరైన అర్హతలు లేని వారు మందులు విక్రయించడం వల్ల సమాజం (Society) తీవ్రమైన నష్టాన్ని చవిచూస్తోంది అని అన్నారు.
ఇది కేవలం చట్ట విరుద్ధమే కాకుండా ప్రజల ప్రాణాలతో ఆటలాడటమే, ఇలాంటి పరిస్థితులను అరికట్టేందుకు డ్రగ్ అధికారులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి అని పేర్కొన్నారు. సమాజ ఆరోగ్య రక్షణ కోసం అర్హత లేని వారి చేత ఔషధాల విక్రయం కొనసాగకుండా ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ, కార్యదర్శి శంకర్, ఉపాధ్యక్షుడు డాక్టర్ అజిత్ కుమార్ గట్టు, సోమరాజ్ శేఖర్, జాయింట్ సెక్రటరీ భుజంగ రావు, మల్కాజిగిరి మండల అధ్యక్షుడు నర్సింగ్ రావు, ఆల్వాల్ మండల అధ్యక్షురాలు సుజాత,కార్యదర్శి రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
