ఆలేరు నియోజకవర్గం రాజపేట మండలంలో పులి గత 15 రోజులుగా సంచరిస్తుండటం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. పలు గ్రామాల్లో లేగ దూడలు, ఆవులు, మేకలను చంపి తినడంతో గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పులి దాడులతో పశువుల నష్టం పెరుగుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ రోజు ఆలేరు మండలం శ్రీనివాసపురం శివారులో పులి అడుగుల జాడలు కనిపించడంతో ఆలేరు పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో అదిగో పులి ఇదిగో మేక అన్న చందంగా భయాందోళన వాతావరణం నెలకొంది. గత కొన్ని రోజులుగా పులి సంచారం కారణంగా గ్రామాల్లో ప్రజలకు కంటి నిండా కునుకు లేకుండా పోయింది. రాత్రివేళ బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. ముఖ్యంగా రైతులు బావుల వద్దకు వెళ్లాలంటే ప్రాణభయంతో వణికిపోతున్నారు.
బావుల దగ్గర కట్టేసిన ఆవులు, మేకలను పులి దాడి చేసి చంపుతున్న ఘటనలు వరుసగా జరుగుతుండటంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పులి జాడను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ట్రాకింగ్ టీమ్లు, పులి అడుగుల పరిశీలన, అడవుల్లో నిఘా వంటి చర్యలు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు.
అయితే ఇప్పటివరకు పులి అటవీ శాఖ అధికారులకు చిక్కకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా ఒంటరిగా బయటకు వెళ్లవద్దని అటవీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గ్రామాల్లో భద్రత చర్యలు పెంచాలని, పులిని త్వరగా పట్టుకుని ప్రజలకు రక్షణ కల్పించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

ఈ సందర్భంగా పులి సంచరించిన ప్రాంతాన్ని సందర్శించిన ఆలేరు సిఐ యలాద్రి మాట్లాడుతూ పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చీకటి పూట ఒంటరిగా బయటకు వెళ్లకూడదని ముఖ్యంగా పంట పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులతో కలిసి పులిని బంధిస్తామని ఆయన తెలిపారు.
