Wednesday, February 11, 2026
Homeతెలంగాణపథకాల అమలు కార్యక్రమం అంతా బోగస్సే

పథకాల అమలు కార్యక్రమం అంతా బోగస్సే

  • 4 పథకాలు, ఒక గ్రామాన్ని యూనిట్‌గా చేయడం సరికాదు
  • ఇచ్చిన హామీలన్ని అమలు చేయాలి
  • కాంగ్రెస్‌, బీజేపీల నైజం ప్రజలకు అర్ధమైంది
  • మీడియాతో మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌ రెడ్డి

నాలుగు పథకాల అమలు కార్యక్రమం అంతా బోగస్సే అని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్‌ రెడ్డి(Guntakandla Jagadish Reddy) అన్నారు. ప్రజా పాలన పథకాల్లో మండలానికి ఒక గ్రామం యూనిట్‌గా తీసుకుని లబ్ధిదారుల ఎంపిక చేయడం పట్ల ఆదివారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో అయన మీడియాతో మాట్లాడారు. నిన్నటి వరకు దరఖాస్తులు తీసుకుని తెల్లారే లబ్ధిదారుల ఎంపిక అంటున్నారన్నారు. గ్రామ సభలు అన్నీ ఒక ప్రహాసనంగా మార్చారని.. రెండు సార్లు దరఖాస్తులు తీసుకుని బుట్ట దాఖలు చేసి మళ్లీ దరఖాస్తులు ఎందుకన్నారు. పైరవీ చేసుకున్న వారికి మాత్రమే లబ్ది చేకూరుతుందని.. గ్రామ సభలన్నీ ప్రజల నిరస నలతో మార్మోగిపోతున్నాయని గుర్తుచేశారు. మండలానికో గ్రామం, మార్చి 31 అంటూ ఇంకా ప్రజలని మభ్య పెడుతున్నారన్నారు. డిసెంబర్‌ 9 అని చెప్పి ఇప్పుడు సంవత్సరానికి ఒక గ్రామంతో మొదలుపెట్టారని.. రాష్ట్రమంతా పూర్తి చేయడానికి ఎంత సమయం తీసుకుంటారో చెప్పాలని ప్రశ్నించారు. హామీల అమలులో విఫలం అవుతున్నారని.. ఒక్కొక్కటిగా కేసీఆర్‌ ఇచ్చిన కరెంట్‌, నీళ్ళు ఇవ్వలేక గప్పాలు కొడుతున్నారన్నారు. ఇందిరమ్మ బొమ్మ పెడితే పథకాలకు పైసలీయమని హామీలు ఎగ్గొట్టడానికే కాంగ్రెస్‌, బీజేపీలు డ్రామాలాడుతున్నారన్నారు. ఒకరు రాష్ట్రానికి టోకరా వేస్తే మరొకరు దేశానికి వేస్తున్నారన్నారు. ప్రజలను మోసం చేస్తూ ప్రజల కోసం కొట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ పై కక్ష కడుతున్నారన్నారని, కాంగ్రెస్‌, బీజేపీ ఇద్దరూ తెలంగాణా ద్రోహు లేనన్నారు. కాంగ్రెస్‌, బీజేపీల నైజం ప్రజలకు అర్ధమై తిరుగు బాటుకు సిద్ధమైతున్నారన్నారు.గ్రామ సభల ద్వారా ప్రజల వ్యతిరేకత మొదలైందని, కాంగ్రెస్‌, బీజేపీ లకు రానున్న రోజుల్లో తెలంగాణా ఉద్యమం నాటి చుక్కలే చూపిస్తారన్నారు. ప్రతి పక్షంగా ఇంకా మేము పిలుపు ఇవ్వక ముందే ప్రజలు తిరగ బడుతున్నారని.. ప్రజల ఉద్యమానికి బీఆర్‌ఎస్‌ నాయకత్వం వహిస్తుందన్నారు. ఇచ్చిన హామీలు డిసెంబర్‌ 9 సోనియా జన్మదినం అని చెప్పి రెండు బర్తుడేలు పోయాక ఇప్పుడు ఒక్క గ్రామం అంటున్నారని ఏద్దేవా చేశారు. మార్చ్‌ 31 తరవాత అయినా పూర్తి స్థాయి పథకాల అమలు అనుమానంగానే కనిపిస్తుందని, ప్రభుత్వాన్ని నడపడం కాంగ్రెస్‌కి చేతకావడం లేదన్నారు. దోచుకోవడం కప్పం కట్టడంతోనే రేవంత్‌కి సమయం సరిపోవడంలేదు ఇక పాలన ఎం చేస్తారని మండిపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News