మంజీరా నదిలో కార్తీక స్నానాలు
చిలిపిచేడ్, నవంబర్ 20 (ఆదాబ్ హైదరాబాద్): మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీచాముండేశ్వరి ఆలయం గురువారం భక్తుల (Devotees) రద్దీతో కిటకిటలాడింది. పవిత్ర కార్తీక మాసం (Kartheeka Masam) చివరి రోజు అమావాస్య (Amavasya) కావడంతో పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ పరిసరాలు అమ్మవారి నామస్మరణతో మార్మోగాయి.

అభిషేకం (Abhishekam), సహస్రనామార్చన, కుంకుమార్చన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు మంజీరా నది(Manjeera River)లో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. పట్టు వస్త్రాలు, ఒడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ ప్రాంగణంలో పండగ వాతావరణం (Festive Atmosphere) నెలకొంది.
