డాక్టర్ బీఆర్ అంబేద్కర్(Dr.BR Ambedkar) వర్ధంతి సందర్భంగా ఆయనకు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం(Deputy CM) మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) ఘనంగా నివాళులు అర్పించారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్బండ్ వద్ద భారతరత్న(Bharataratna) డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనలు తెలంగాణ ప్రభుత్వ పాలనకు మార్గదర్శక సూత్రాలని చెప్పారు. భవిష్యత్తులోనూ రాష్ట్రానికి మాత్రమే కాకుండా మొత్తం దేశానికి ఆయన సిద్ధాంతాలే దిశానిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆలోచనల మేరకు నడిచినప్పుడే ఈ దేశానికి గొప్ప భవిష్యత్తు ఉంటుందని అన్నారు.
‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అత్యంత బలమైన, అద్భుతమైన రాజ్యాంగాన్ని (Constitution) అందించిన మహానేత డాక్టర్ బీఆర్ అంబేద్కర్. భారత సామాజిక విప్లవానికి మూలస్తంభంగా నిలిచిన ఆ మహానుభావుడు అస్పృశ్యత, కులవివక్షలకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేశారు. అట్టడుగు సామాజిక వర్గాల ఆత్మగౌరవం, విద్య, ఉద్యోగ అవకాశాల కోసం మహాద్ సత్యాగ్రహం, కాలారాం ఆలయ ప్రవేశోద్యమం వంటి చారిత్రక పోరాటాలు నడిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి సమతా మార్గాన్ని ప్రపంచానికి చూపిన మార్గదర్శకుడు. అంబేద్కర్ ఆలోచనలు, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సుదీర్ఘ కృషి యువతకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే’ అని భట్టి విక్రమార్క వివరించారు.
