అస్వస్థతకు గురై హఠాన్మరణం
ప్రముఖ కవి (Poet) అందెశ్రీ (Andesri) ఇకలేరు. ఈ రోజు ఉదయం కన్నుమూశారు. హైదరాబాద్లోని ఇంటిలో తీవ్ర అస్వస్థతకు హఠాన్మరణం పాలయ్యారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ హాస్పిటల్(Gandhi Hospital)కి తీసుకెళ్లినా.. అప్పటికే చనిపోయారని డాక్టర్లు చెప్పారు. దీంతో ఆయన భౌతిక కాయాన్ని లాలాపేటలోని తన నివాసానికి, అనంతరం స్థానిక బల్దియా ఇండోర్ స్టేడియంలో అభిమానుల ఆఖరి చూపు కోసం తరలించారు.
అందెశ్రీగా పేరొందిన అందె ఎల్లయ్య (Ande Yellaiah).. 1961 జులై 18న సిద్దిపేట జిల్లా రేబర్తి గ్రామంలో పుట్టారు. గొర్రెల కాపరి(Shepherd)గా జీవితాన్ని ప్రారంభించి, మధ్యలో కొన్నాళ్లు భవన నిర్మాణ కార్మికుడి(Construction Worker)గా చేశారు. తెలంగాణ ఉద్యమం(Telangana Movement)లో పాల్గొన్నారు. ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు..’ అనే గీతంతో పాపులర్ అయ్యారు. అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’(Jaya Jaya He Telangana)ను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గీతం(State Anthem)గా గుర్తించింది.
బాల్యంలో బతుకు బండిని లాగేందుకు బడికి వెళ్లలేని స్థితిలో ఉండిపోయిన అందె ఎల్లయ్య.. రచయిత(Writer)గా రాణించారు. డాక్టరేట్లు పొందారు. అవార్డులు అందుకున్నారు. అందెశ్రీ మరణం పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రతిపక్ష నేతలు, సినీ, రాజకీయ ప్రముఖులు, ప్రజా సంఘాల నేతలు ఘన నివాళులు అర్పించారు. అందెశ్రీ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో జరపాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
