Monday, October 27, 2025
ePaper
Homeబిజినెస్Museum | హైదరాబాద్‌లో సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం..

Museum | హైదరాబాద్‌లో సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం..

భారతదేశంలో సెమీకండక్టర్‌ రంగానికి కొత్త దిశ చూపే చారిత్రాత్మక అడుగుగా, దేశంలోనే తొలి ‘సెమీకండక్టర్‌ ఇన్నోవేషన్ మ్యూజియం’ హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. టెక్నాలజీ చిప్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్‌ (టీ–చిప్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మ్యూజియం ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కీలక నాయకులు, పారిశ్రామిక వేత్తలు, అకాడమియా, పెట్టుబడిదారులు, ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, పార్లమెంట్ సభ్యుడు కొండ విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

ప్రజలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేయాలనే లక్ష్యంతో రూపొందించిన ఈ మ్యూజియంలో హ్యూమనాయిడ్‌ రోబోట్‌లు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో నడిచే పెట్‌ డాగ్‌, దేశంలోనే తొలి స్వదేశీ ఏఐ చిప్‌, మళ్లీ వాడదగిన రాకెట్‌ ఇంజిన్‌, నెక్స్ట్‌ జనరేషన్‌ ఈవీ మరియు డిస్ప్లే టెక్నాలజీలు వంటి అద్భుత ఆవిష్కరణలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లభించింది. ప్రత్యేకంగా రూపొందించిన 30 రోజుల ఇన్నోవేషన్ రెసిడెన్సీ మోడల్ ద్వారా ప్రతి నెలా కొత్త స్టార్టప్‌లు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు తమ సాంకేతికతను ఇక్కడ ప్రదర్శించనున్నారు.

మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ..“సెమీకండక్టర్‌ రంగం దేశ ప్రాధాన్య రంగంగా మారింది. ‘సెమీకాన్ ఇండియా’, ‘డిజిటల్ ఇండియా’, ‘మేక్ ఇన్ ఇండియా’ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల దిశగా టీ–చిప్‌ చేస్తున్న పని ప్రశంసనీయం అనీ కొనియాడారు. దేశ వ్యాప్తంగా ఈ రంగం అభివృద్ధి చెందేందుకు అవసరమైన అన్ని విధాలా మద్దతు ఇవ్వడానికి నేను కేంద్ర స్థాయిలో కృషి చేస్తాను” అని హామీ ఇచ్చారు.

రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ..“ సాంకేతిక మార్పులలో తెలంగాణా ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. ఈ రంగం కోసం రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన మద్దతు, మౌలిక వసతులు, ప్రతిభా వికాసం వంటి అన్ని అంశాల్లో సహకరిస్తుంది. ఈ మ్యూజియం విద్యార్థులకు ప్రేరణగా, స్టార్టప్‌లకు వేదికగా, పరిశోధనకు ప్రయోగశాలగా మారనుంది” అని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News