రేషన్ కార్డుల జారీని వేగవంతం చేయాలి
సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
సికింద్రాబాద్, జనవరి 22(ఆదాబ్ హైదరాబాద్): సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం (Secunderabad Assembly Constituency) నామాలగుండు (Namalagundu) ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న జీహెచ్ఎంసీ కొత్త వార్డ్ ఆఫీస్ బిల్డింగ్ నిర్మాణాన్ని నిర్ణీత గడువులోగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని స్థానిక ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ (MLA Padmarao Goud) అధికారులను ఆదేశించారు. గురువారం జీహెచ్ఎంసీ అధికారులు, స్థానిక కార్పొరేటర్లతో కలిసి ఆయన నిర్మాణ పనులను పరిశీలించారు. రూ.2 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ భవన నిర్మాణంలో ఎలాంటి జాప్యం జరగకుండా పనులను వేగవంతం చేయాలని, అదే సమయంలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ప్రజలకు అవసరమైన అన్ని సేవలు ఒకేచోట అందేలా ఈ కార్యాలయాన్ని అభివృద్ధి చేయాలని అన్నారు. అనంతరం.. సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో అర్హులైన ప్రతిఒక్కరికీ రేషన్ కార్డులను (Ration Cards) త్వరితగతిన మంజూరు చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. సీతాఫల్మండి పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో పౌర సరఫరాల అధికారి చాముండేశ్వరి, ఇతర అధికారులతో కలిసి విభాగం పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ మాట్లాడుతూ.. పౌర సరఫరాల సేవలు ప్రజలకు మరింత సులభంగా, పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా సమస్యలను త్వరగా పరిష్కరించేలా అధికారులు పనిచేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా సమన్వయంతో ముందుకు సాగాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సామల హేమ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్వర్ణలత, డిప్యూటీ ఇంజనీర్ మాధవి, పౌర సరఫరాల శాఖ అధికారి చాముండేశ్వరి తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
