Thursday, February 12, 2026
Homeజాతీయంఉగ్రవాదులను ఊరికే వదలం

ఉగ్రవాదులను ఊరికే వదలం

  • తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
  • ఘాటుగా హెచ్చరించిన రాజ్‌నాథ్‌ సింగ్‌

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యటకులపై జరిగిన ఉగ్రదాడి ఘటనకు బదులు తీర్చుకుంటామని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌పై కుట్ర పన్నుతున్న వారిని ఊరికే వదలబోమన్నారు. దాడికి భారత్‌ గట్టిబదులిస్తుందని ఉగ్రవాదులను హెచ్చరించారు. పహల్గాం ఉగ్రదాడి పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించాలనేది భారత్‌ విధానమని.. ఉగ్రవాదులను ఎదుర్కొనే విషయంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉన్నారని పేర్కొన్నారు. తమ కుటుంబసభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. దాడికి పాల్పడిన వారిని..కుట్ర పన్నిన వారిని బయటకు లాగి, తగిన బుద్ధి చెబుతామని అన్నారు. పహల్గాం ఘటనకు సంబంధించిన విషయాలు, శ్రీనగర్‌లో భద్రతా చర్యలు వంటి వాటి గురించి ఆయన ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ దినేశ్‌ త్రిపాఠితో చర్చలు జరిపిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సమావేశంలోనూ ఆయన పాల్గొననున్నారు. కశ్మీర్‌లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాం సవిూప బైసరన్‌ లోయలో ఉగ్రవాదులు మంగళవారం భీకర దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యటకులను చుట్టు-ముట్టి.. అతి సవిూపం నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం అడవుల్లోకి పారిపోయిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ముమ్మర గాలింపుచర్యలు చేపట్టాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News