నల్లగొండ, నవంబర్ 14 (ఆదాబ్ హైదరాబాద్): ‘తెలివైన పిల్లలు.. మత్తు లేని జీవితం!’ అనే నినాదంతో నేటి బాలలే దేశ ప్రగతికి మూలాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. మాదకద్రవ్యాల (Drugs) బారి నుంచి యువతను రక్షించే లక్ష్యంతో బాలల దినోత్సవం (Childrens Day) సందర్భంగా నూతనంగా ‘ప్రాజెక్టు శుద్ధి’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పట్టణ కేంద్రంలోని సెయింట్ అల్ఫోన్సస్ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన బాలల దినోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ.. నేటి కంప్యూటర్ యుగం(Computer Era)లో అభివృద్ధి (Development) వైపు పరుగులు తీయాల్సిన యువత(Youth), పోటీ పడాల్సిన బాల్యం మాదకద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మాదకద్రవ్యాల సేవనం వల్ల ఆరోగ్యంపై, సామాజిక అసమానతలపై, ఆర్థిక పరిస్థితిపై, భవిష్యత్తుపై పడే దుష్ప్రభావాలను వివరిస్తూ విద్యార్థులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సమగ్రంగా అవగాహన కల్పించారు. బాల్యం ఎంతో అందమైందని, ఈ కీలక సమయంలో చెడు అలవాట్లకు దూరంగా ఉండి, క్రమశిక్షణతో చదువుపై దృష్టి సారించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
తల్లిదండ్రులు సామాజిక బాధ్యతగా తమ పిల్లల భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి సారించాలని, వారి జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత తీసుకోవాలని ఎస్పీ కోరారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గతంలో మిషన్ పరివర్తన్ (Mission Parivarthan) పేరుతో అనేక మంది మాదకద్రవ్యాలకు అలవాటు పడిన యువకుల్లో మార్పు తీసుకురాగలిగామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ డీఎస్పీ కె.శివరాంరెడ్డి, ఎస్బీ సీఐ రాము, 1 టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ లచ్చి రెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ ఉదయ్ కుమార్ రెడ్డి, అధిక సంఖ్యలో విద్యార్థినీవిద్యార్థులు పాల్గొన్నారు.
