గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆఫీస్ ఇన్చార్జ్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ అశోక్ కుమార్ తెలిపారు. రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి లక్ష్యంగా సహకార సంఘాలు అందిస్తున్న సేవలు ప్రశంసనీయం అని పేర్కొన్నారు. బుధవారం ఆలేరు పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సీఈఓ వెంకట్ రెడ్డి అధ్యక్షతన మహాజన సభ ఘనంగా నిర్వహించారు.
ఈ సభకు రైతులు, ప్రజాప్రతినిధులు, సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఆర్థిక భరోసా కల్పించడంలో సహకార సంఘాలు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు తక్కువ వడ్డీపై రుణాలు అందించడం, సమయానికి విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడం వంటి అంశాల్లో సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు.

ఇటీవల సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానించి సేవలను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అందిస్తున్నాయని ఆయన తెలిపారు. డిజిటల్ విధానాల ద్వారా లావాదేవీలలో పారదర్శకత పెరిగిందని, రైతులు సులభంగా సేవలను పొందగలుగుతున్నారని అన్నారు. రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం, పంటల ఉత్పత్తి పెంపు, మార్కెటింగ్ సౌకర్యాల కల్పన వంటి అంశాల్లో సహకార సంఘాల పాత్ర మరింత విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు. రైతుల అభివృద్ధి ద్వారానే గ్రామీణాభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
సభలో మాజి డైరెక్టర్ గవ్వల నర్సింహులు, అరె మల్లేశం, దరెడ్డి శేఖర్ రెడ్డి, మంతపురి గ్రామ సర్పంచ్ పసుల సతీష్ రెడ్డి, ఉప సర్పంచ్ దంతూరి స్వామి పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రైతులు నర్సింహులు, బాలయ్య తదితరులు మాట్లాడుతూ సహకార సంఘాల సేవలు మరింత విస్తరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ సిబ్బంది ప్రభాకర్, సంజయ్, కార్తీక్తో పాటు పలువురు రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
