- సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ ముందుకు..
- ఫోన్ ట్యాపింగ్, హార్డ్ డిస్క్ ల ధ్వంసంపై విచారణ
- వారం రోజుల పాటు కస్టడీ విచారణ
- ఇంటినుంచే భోజనం, మెడిసిన్ కు పర్మిషన్
ఫోన్ ట్యాపింగ్ కేసులోఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ ముందు లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో దర్యాప్తు అధికారి ఏసీపీ వెంకటగిరి ముందు ప్రభాకర్రావు సరెండర్ అయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రభాకర్ రావును సిట్ అధికారులు ఆరు సార్లు విచారణ జరిపిన విషయం తెలిసిందే. అయితే సిట్ విచారణకు ప్రభాకర్ సహకరించకపోవడంతో కస్టోడియల్ విచారణకు ఇవ్వాలని సుప్రీంకోర్టును ప్రభుత్వం ఆశ్రయించింది. దీంతో ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణకు సుప్రీం ధర్మాసనం అనుమతి ఇచ్చింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఎస్ఐబీ మాజీ చీఫ్ సిట్ ముందు సరెండర్ అయ్యారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతోంది.
ఏడాది మే 29 నుంచి ఇప్పటి వరకు సుప్రీం కోర్టు కల్పించిన మధ్యంతర రక్షణలోనే ప్రభాకర్ రావు ఉన్నారు. మధ్యంతర రక్షణలోనే అరెస్ట్ కాకుండా ఆరు సార్లు విచారణకు వచ్చారు ప్రభాకర్. అయితే ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం కీలక అఫిడవిట్ను దాఖలు చేసింది. మధ్యంతర రక్షణ కల్పించడంతో కేసు విచారణకు ప్రభాకర్ రావు సహకరించడం లేదని కస్టోడియల్ విచారణకు అనుమతి ఇవ్వాలని, ఈ విచారణ జరిగితే తప్ప ప్రభాకర్ నుంచి ఆధారాలు రాబట్టలేమని సుప్రీం కోర్టులో ప్రభుత్వం వాదనలు వినిపించింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు విన్న ఉన్నతన్యాయస్థానం.. ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణకు అనుమతి ఇవ్వడంతో ఆయన లొంగిపోయారు. ఈరోజు ప్రభాకర్ రావు అరెస్ట్ చూపిన తర్వాత ఏడు రోజుల కస్టోడియల్ విచారణ కొనసాగనుంది. కస్టోడియల్ విచారణ రిపోర్టును సుప్రీం కోర్టుకు సిట్ సమర్పించనుంది.
