మోతె మండలం సింగరేణిపల్లి టోల్ప్లాజా వద్ద ఎక్సైజ్ పోలీసుల వాహన తనిఖీలు
లారీలో అక్రమంగా 1167 బస్తాల నల్ల బెల్లం పౌడర్ తరలింపు
లారీతోపాటు బెల్లం పౌడర్ సీజ్
ఇద్దరిపై కేసు నమోదు
సూర్యాపేట, డిసెంబర్ 2(ఆదాబ్ హైదరాబాద్): నల్ల బెల్లం (Black Jaggery) అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సంఘటన మోతె మండలం సింగరేణిపల్లి టోల్ప్లాజా సమీపంలో జరిగింది. సూర్యాపేట ఎక్సైజ్ పోలీసులు, నల్గొండ ఏసీ ఎన్ఫోర్స్మెంట్ బృందం సంయుక్తంగా చేపట్టిన వాహనాల తనిఖీల్లో (Vehicle Inspections) ఈ వ్యవహారం వెలుగు చూసింది.
దీంతో.. భారీ మొత్తంలో అక్రమ నల్ల బెల్లం పౌడర్ను స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ సంతోష్, సూర్యాపేట జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్.లక్ష్మానాయక్ ఆధ్వర్యంలో మంగళవారంఉదయం ఈ తనిఖీలు నిర్వహించారు.
ఇందులో భాగంగా (కేఏ39ఏ2050) అశోక్ లేలాండ్ లారీని ఆపి తనిఖీ చేసిన అధికారులు.. వాహనంలో 1167 బస్తాల నల్ల బెల్లం పౌడర్ ఉన్నట్లు గుర్తించారు. ఒక్కో బస్తా 30 కిలోల బరువు ఉంటుంది. మొత్తం 350.1 క్వింటాళ్ల నల్ల బెల్లం పౌడర్ను సీజ్ చేశారు. ఈ నల్ల బెల్లం సరఫరా చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు (Arrest) చేశారు.
నిందితులు (Accused) కర్ణాటకకు చెందిన శ్యామ్(బీదర్ తాలూకా), జగన్నాథ్(చిన్న చోళీ, కల్బుర్గి జిల్లా) అని సూర్యాపేట ఎక్సైజ్ సీఐ మల్లయ్య తెలిపారు. స్వాధీనం చేసుకున్న లారీ (Seized Lorry)ని పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ సీఐ వెంకటేశ్వర్లు, ఎక్సైజ్ ఎస్ఐలు గోపాల్ రావు, శోభారాణి, హెడ్ కానిస్టేబుల్ అఫ్సర్, కానిస్టేబుళ్లు వనజ, గౌతమి, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.
