హైదరాబాద్(Hyderabad)లో స్కైరూట్ సంస్థ ఏర్పాటుచేసిన ఇన్ఫినిటీ (Infinity) అనే ఫెసిలిటీ (Facility)ని ప్రధాని మోదీ (PM Modi) ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించారు. ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టగల సామర్థ్యం కలిగిన స్కైరూట్ కంపెనీ తొలి కక్ష్య రాకెట్ (Orbital Rocket) విక్రమ్-I(Vikram-I)ను కూడా ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన చారిత్రాత్మక అంతరిక్ష సంస్కరణలను వివరించారు. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థలకు అవకాశం ఇవ్వడం వల్ల స్కైరూట్, ఇతర సంస్థలు సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు వస్తున్నాయని ప్రశంసించారు.
భారత అంతరిక్ష వ్యవస్థలో నేడు ప్రైవేట్ రంగం అద్వితీయంగా పనిచేస్తోందని అన్నారు. ‘300కి పైగా అంతరిక్ష స్టార్టప్లు ఈ రంగంలో కొత్త ఆశలను నింపుతున్నాయి. “ఇన్ఫినిటీ క్యాంపస్.. దేశంలోని నూతన ఆలోచన, ఆవిష్కరణ, యువశక్తికి ప్రతిబింబం. యువత ఆవిష్కరణ, రిస్క్ తీసుకునే సామర్థ్యం, వ్యవస్థాపకత కొత్త శిఖరాలను తాకుతున్నాయి” అని ప్రధాని పేర్కొన్నారు. నేడు దేశ అంతరిక్ష రంగం ప్రపంచ పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా మారుతోందని తెలిపారు. భారతదేశ ప్రైవేట్ అంతరిక్ష ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా తనదైన గుర్తింపును ఏర్పరుచుకుంటోందని వివరించారు.
