మక్కా యాత్రకు వెళ్లిన పలువురు భారతీయ యాత్రికులు మదీనాలో రోడ్డు ప్రమాదానికి గురై పెద్ద సంఖ్యలో యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘మదీనా రోడ్డు ప్రమాదంలో భారతీయులు మృత్యువాత పడటం బాధాకరం. ఈ ప్రమాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబసభ్యులకు నా ప్రగాఢసానుభూతి.
గాయపడ్డ వారు అత్యంత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. రియాద్లో ఇండియన్ ఎంబసీ, జెడ్డాలోని కాన్సులేట్ సాయం అందిస్తున్నాయి. భారత అధికారులు సౌదీ అధికారులతో ఈ ప్రమాదం గురించి ఎప్పటికప్పుడు చర్చిస్తూ ఉన్నారు’ అని అన్నారు. కాగా, సోమవారం తెల్లవారు జామున భారతీయ యాత్రికులు మక్కాలో ప్రార్థనలు ముగించుకుని బస్సులో మదీనా వెళుతూ ఉన్నారు. వారు ప్రయాణిస్తున్న బస్సు 1.30 గంటల ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. పెద్ద సంఖ్యలో యాత్రికులు సజీవ దహనం అయ్యారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు.
