- కేంద్ర ప్రభుత్వం ఎక్సయిజ్ ద్యూటీ తగ్గించినా ఫలితం లేదు..
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినా వాహనదారులకు ఎలాంటి ఊరట లభించలేదు. పెట్రోల్, డీజిల్పై లీటర్కు రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ఇవాళ ఉదయం కేంద్రం ప్రకటించింది. అయితే ఈ తగ్గింపు ప్రయోజనం వినియోగదారులకు చేరదని, రిటైల్ ధరలు యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది. ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎదుర్కొంటున్న భారీ నష్టాలను భర్తీ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుత అంతర్జాతీయ ధరల ప్రకారం.. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి సంస్థలు లీటర్ పెట్రోల్పై సుమారు రూ.26, లీటర్ డీజిల్పై రూ.81.90 చొప్పున నష్టపోతున్నాయి. ఈ కంపెనీలు రోజుకు మొత్తంగా రూ.2,400 కోట్ల నష్టాన్ని భరిస్తున్నాయని మంత్రిత్వ శాఖ వివరించింది. తాజాగా తగ్గించిన రూ.10 ఎక్సైజ్ సుంకం ఈ నష్టాల్లో కొంత భాగాన్ని భర్తీ చేస్తుందని, దీనివల్ల సరఫరాకు అంతరాయం కలుగకుండా చూసుకోవచ్చని పేర్కొన్నది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా గత నెల రోజుల్లోనే అంతర్జాతీయంగా ముడి చమురు ధర బ్యారెల్కు 70 డాలర్ల నుంచి 122 డాలర్లకు అంటే ఏకంగా 75 శాతం పెరిగిందని ప్రభుత్వం తెలిపింది. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇంధన ధరలు 20 శాతం నుంచి 50 శాతం వరకు పెరిగినా.. భారత్లో మాత్రం ధరలను స్థిరంగా ఉంచామని పేర్కొన్నది. సామాన్య పౌరులను కాపాడేందుకే ప్రధాని మోదీ ప్రభుత్వ ఆదాయాన్ని వదులుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు.
