- ఉద్యోగులకు వర్క్ ఫ్రేమ్ హోమ్, స్టూడెంట్స్ కు ఆన్లైన్ క్లాస్..
అమెరికా-ఇరాన్ యుద్ధం సెగ పాకిస్థాన్ను కూడా తాకింది. హొర్ముజ్ జల సంధిని మూసివేయడంతో పాకిస్థాన్కు జరగాల్సిన చమురు దిగుమతులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే తీవ్ర నగదు కొరతతో కునారిల్లుతున్న పాకిస్థాన్.. దేశంలో నెలకొనబోయే చమురు కొరతను తలచుకుని ఉలిక్కిపడుతున్నది. దీంతో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం చమురు వినియోగాన్ని ఆదా చేసే ప్రయత్నాలు చేపట్టాలని నిర్ణయించింది.
అందులో భాగంగా కొవిడ్ సమయంలో చేపట్టిన పొదుపు, జాగ్రత్త చర్యల్లాంటివే తిరిగి దేశంలో అమలు చేయాలని యోచిస్తున్నది. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్, విద్యార్థులకు ఆన్లైన్ తరగతులతో పాటు రోడ్లపై తక్కువ సంఖ్యలో మాత్రమే వాహనాలు తిరిగేలా చర్యలు చేపట్టనుంది. 47 లక్షల మంది పాక్ పౌరులు గల్ఫ్లోని వివిధ దేశాల్లో నివసిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో వారి నుంచి నగదు బదిలీ ఆగిపోతుంది. ఇది ఆర్థికంగా మరింత ఇబ్బంది కానుంది. మార్చిలో అత్యవసరమైన సిబ్బంది మాత్రమే కార్యాలయాలకు రావాలని, మిగిలిన వారు వర్క్ఫ్రం హోమ్ చేయాలని ఆదేశాలు జారీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నదని డాన్ పత్రిక వెల్లడించింది. టెలికం, ఐటీ కంపెనీల సిబ్బంది కూడా వారానికి కనీసం రెండు రోజులు వర్క్ ఫ్రం హోమ్ చేయాలని ఆదేశించనుంది.
