- ఓయూ ఏసీపీ జగన్
- భగత్ సింగ్ స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణకు యువత ముందుకు రావాలి: ఆర్.ఎల్. మూర్తి
షహీద్ భగత్ సింగ్ స్మారక యువజనోత్సవాల సందర్భంగా స్టూడెంట్స్ ఫెడరేషన్ అఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ అఫ్ ఇండియా(డీవైఎఫ్ఐ) హైదరాబాద్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఓయూ సీ గ్రౌండ్లో నిర్వహించిన షహీద్ భగత్ సింగ్ హైదరాబాద్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ను ఓయూ ఏసీపీ జగన్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏసీపీ జగన్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా గంజాయి,డ్రగ్స్,బెట్టింగ్ యాప్స్ వంటి మాదకద్రవ్యాల బారిన పడకూడదని సూచించారు.
సంపూర్ణ ఆరోగ్యానికి క్రీడలు ఎంతో అవసరమని,క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించడంలో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కమిటీల కృషి అభినందనీయమని పేర్కొన్నారు.ఓయూ సీఐ మహేష్ గౌడ్ మాట్లాడుతూ డ్రగ్స్,గంజాయి నిర్మూలనకు పోలీస్ వ్యవస్థ కట్టుబడి ఉందని,ఇలాంటి మంచి కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఆర్.ఎల్. మూర్తి మాట్లాడుతూ షహీద్ భగత్ సింగ్ కలలుగన్న సమాజ నిర్మాణం కోసం ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ దేశవ్యాప్తంగా బహుముఖ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువతను మత్తులో ముంచి పాలకవర్గాలు దేశ సంపదను కార్పొరేట్ వర్గాలకు దోచిపెడుతున్నాయని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జావీద్,ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.అశోక్ రెడ్డి,జిల్లా అధ్యక్షులు లెనిన్,డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు హస్మి బాబు,జిల్లా నాయకులు నాగేందర్, రాజయ్య, దేవేందర్, రమ్య,రజనీకాంత్, శ్రీమాన్, అర్జున్, శ్రీకాంత్, ప్రవీణ్, అంజి, అశ్వాక్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
