- ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందజేసిన చైర్మన్ బూడిద వెంకటేష్
బృహత్ మహానగర పరిధిలోని జవహర్ నగర్ మదర్ తెరిస్సా కాలనీలో కొలువై ఉన్న ముత్యాలమ్మ తల్లి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో జవహర్ నగర్లోని వివిధ కాలనీల ప్రముఖులకు ఆలయ వార్షికోత్సవ ఆహ్వాన పత్రికలను బుధవారం అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ బూడిద వెంకటేష్ మాట్లాడుతూ ముత్యాలమ్మ తల్లి దీవెనలతో గత సంవత్సరం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించామని తెలిపారు. ఈ సంవత్సరం కూడా తల్లి ఆశీర్వచనంతో ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సిద్ధంగా ఉందని చెప్పారు. స్వస్తిశ్రీ విశ్వాస నామ సంవత్సర మాఘశుద్ధ వసంత పంచమి శుక్రవారం 23వ తేదీన ఈ వేడుకలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఆరోజు ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవ, 8 గంటలకు గణపతి పూజ, పుణ్యహవాచనం, రక్షాబంధనం, మూలతంత్ర జపాలు, ఉదయం 10 గంటలకు హావనం, 11 గంటల 45 నిమిషాలకు పూర్ణాహుతి, అమ్మవారికి కలశాభిషేకం, 12 గంటల 15 నిమిషాలకు కుంభ ప్రోక్షణ, 12 గంటల 30 నిమిషాలకు మహా నైవేద్యం, హారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒంటిగంటకు అన్నదానం బోనాలు, సాయంత్రం 6 గంటలకు ముత్యాలమ్మవారి పల్లకి ఉత్సవం ఘనంగా జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.
బుధవారం ఆలయ చైర్మన్ బూడిద వెంకటేష్ తదితరులు జవహర్ నగర్ అడ్మిన్ ఎస్ఐ రాము, జవహర్ నగర్లోని ప్రముఖులు, పెద్దలు కారింగుల శంకర్ గౌడ్ తదితరులకు ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మదర్ తెరిస్సా కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు
