సెమీస్లో గోవా గార్డియన్స్పై 3-0తో ఘన విజయం
ప్రైమ్ వాలీబాల్ లీగ్ సీజన్ 4
హైదరాబాద్: ఆర్ఆర్ కేబుల్ ప్రైమ్ వాలీబాల్ లీగ్(PVL) సీజన్ 4లో ముంబై మీటియర్స్ (Mumbai Meteors) టైటిల్ పోరుకు చేరుకుంది. గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచిన ముంబై మీటియర్స్ శుక్రవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం(Gachibowli Indoor Stadium)లో జరిగిన సెమీఫైనల్లోనూ (Semi Final) అదే జోరు కొనసాగించింది. గోవా గార్డియన్స్(Goa Guardians)పై 15-8, 15-8, 16-14తో వరుస సెట్లలో ఘన విజయం సాధించింది. సెమీఫైనల్లో గోవా గార్డియన్స్ ఆశించిన ప్రదర్శన కనబరచటంలో విఫలమైంది. శుభమ్ చౌదరి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్(Player Of The Match)గా నిలిచాడు. అహ్మదాబాద్ డిఫెండర్స్(Ahmedabad Defenders), బెంగళూరు టార్పెడోస్(Bangalore Torpedoes) తలపడే రెండో సెమీఫైనల్ విజేతతో ఆదివారం ముంబై మీటియర్స్ ఫైనల్లో పోటీపడనుంది.

డికిన్సన్ ఎటాకింగ్, రోహిత్ యాదవ్ పవర్ఫుల్ సర్వ్లతో ఆరంభంలో గోవా గార్డియన్స్ను ముందంజలో నిలిపారు. ముంబై మీటియర్స్ ఎటాకర్ శుభమ్ చౌదరి, అమిత్ గులియా నిలకడగా స్పైక్లతో దాడి చేయటంతో గోవా గార్డియన్స్ డిఫెన్స్ బలహీనపడింది. డికిన్సన్ సూపర్ స్పైక్తో గోవా సూపర్ పాయింట్ సాధించినా.. క్రమశిక్షణతో కూడిన ఆటతీరుతో ముంబై మీటియర్స్ తొలి సెట్ను సొంతం చేసుకుంది.
ప్రిన్స్ మిడిల్ జోన్ నుంచి ఎదురుదాడి చేయటంతో గోవా గార్డియన్స్ పుంజుకునే ప్రయత్నం చేసింది. కానీ కార్తీక్ మెరుగైన ప్రదర్శనతో ముంబై మీటియర్స్ ముందంజలో కొనసాగింది. శుభమ్ చౌదరి తెలివైన స్పైక్లతో ముంబై అనవసర తప్పిదాలు తగ్గాయి. సెట్టర్ అరవింద్ రాకతో గోవా గార్డియన్స్ మార్పు కోసం ప్రయత్నం చేసింది. మనోజ్ సూపర్ సర్వ్ గోవా శిబిరంలో కాసేపు సంబురాలు కనిపించాయి. కానీ ప్రిన్స్ ఓవర్హిట్తో గోవా మరో సూపర్ పాయింట్ను కోల్పోయింద. దీంతో ముంబై మీటియర్స్ వరుస సెట్లలో పైచేయి సాధించింది.
అమిత్ గులియా సూపర్ సర్వ్లతో ముంబై మీటియర్స్ మూడో సెట్నూ జోరు చూపించింది. ముంబై ఎదురుదాడితో గోవా ఆత్మరక్షణలో పడింది. పీటర్ ఒస్ట్విక్ మిడిల్ జోన్ ఫైట్లో ప్రిన్స్పై ఆధిపత్యం చూపించాడు. విక్రమ్ సూపర్ పాయింట్ విజయంతో గోవా గార్డియన్స్ శిబిరంలో ఆశలు చిగురించాయి. చిరాగ్ యాదవ్ స్పైక్ను బ్లాక్ చేసిన కార్తీక్ గోవా గార్డియన్స్ ఆశలు ఆవిరి చేశాడు. వరుస సెట్లలో విజయం సాధించిన ముంబై మీటియర్స్ పీవీఎల్ 4 సీజన్ ఫైనల్కు చేరుకుంది.
