- భక్తులకు ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేయాలి
- అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి
- అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మెదక్ ఎమ్మెల్యే రోహిత్ శివాణి దంపతులు
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏడుపాయల దేవస్థానం అభివృద్ధి చెందిందని, కోట్లాది రూపాయలు మంజూరు చేయించి జాతరకు వచ్చే భక్తులకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా ఏడుపాయలకు చేరుకున్న ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ శివాణి దంపతులకు ఆలయ పూజారులు, అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
ఎమ్మెల్యే రోహిత్ శివాణి దంపతులు వన దుర్గామాతకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారులు ఎమ్మెల్యే రోహిత్ రావు శివాని దంపతులకు శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యే రోహిత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏడుపాయలను అభివృద్ధి చేసేందుకు గాను సీఎం రేవంత్ రెడ్డి నిధులు మంజూరు చేశారని అన్నారు.

మహాశివరాత్రి సందర్భంగా మూడు రోజులపాటు జరుగుతున్న జాతరకు ఆయా ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రానున్నందున భక్తులకు అవసరమైన వసతులు కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. జాతరలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు సేవలు అందించాలని అన్నారు.
కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మెంచు నగేష్, ఆలయ ఈఓ వీరేశం, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు పబ్బతి ప్రభాకర్ రెడ్డి, జిల్లా నాయకులు ప్రశాంత్ రెడ్డి, శ్రీకాంతప్ప, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోవింద్ నాయక్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు భరత్ గౌడ్, పాపన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు.
